
హైదరాబాద్: ఉప్పల్ వేదికగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ హోరాహోరీగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 173 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6గంటల లోపు ఫలితాలు వెలువడనున్నాయి.హెచ్సీఏ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకూ రాజకీయ రంగు పులుముకుంది. దీంతో బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారుల మధ్య పోటీ నెలకొంది. తమ ప్యానల్కు ప్రభుత్వ మద్దతు ఉందని జగన్మోహనరావు అంటున్నారు. యూనైటెడ్ మెంబెర్స్ ఆఫ్ హెచ్సీఏ ప్యానెల్ పేరుతో జగన్మోహనరావు బరిలోకి దిగారు. ఇక గుడ్ గవర్నెన్స్ ప్యానెల్ పేరుతో అనిల్ కుమార్ ప్యానల్ పోటీలో ఉన్నారు. బీజేపీ నేత, హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ మద్దతుతో అనిల్ కుమార్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ పేరుతో శివలాల్ యాదవ్ ఎన్నికల బరిలోకి దిగారు. అర్షద్ ఆయూబ్ ప్యానల్ తరపున అమర్నాథ్ అధ్యక్షునిగా పోటీ చేస్తున్నారు.ఇప్పటి వరకూ 74 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ క్రికెటర్స్ వెంకటపతి రాజు, వీవీఎస్ లక్ష్మణ్, శివాలాల్ యాదవ్, మిథాలి రాజ్, స్రవంతి నాయుడు ఓటు వేశారు. అలాగే జిహెచ్ఎమ్సి కమిషనర్ రోనాల్డ్ రాస్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.