Apr 26,2023 17:25

హైదరాబాద్‌: మంగళవారం తొలగించిన 200 మందిని విధుల్లోకి తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్టు విద్యుత్‌ ఉద్యోగుల సంఘం నేతలు తెలిపారు. జీతాలు మరింత పెంచాలంటూ విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లు చేపట్టిన సమ్మెను విరమించారు. సీఎండీతో చర్చల అనంతరం సమ్మె విరమిస్తున్నట్టు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రకటించారు.రాష్ట్రంలో 4 విద్యుత్‌ సంస్థలున్నాయి. వీటి పరిధిలో 20,500 మంది వరకూ ఆర్టిజన్లుగా పనిచేస్తున్నారు. వీరంతా క్షేత్రస్థాయిలో సబ్‌స్టేషన్లు, విద్యుత్‌లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ వంటి పనుల్లో ఇంజినీర్లకు సహాయంగా ఉంటున్నారు. ఈ నెల 15న కొత్త పీఆర్‌సీకి శాశ్వత ఉద్యోగసంఘాలన్నీ ఒప్పుకోవడంతో 7 ఫిట్‌మెంట్‌తో పాటు అదనంగా రెండు ఇంక్రిమెంట్లు ఆర్టిజన్లకు ఇవ్వాలని విద్యుత్‌ సంస్థలు నిర్ణయించాయి. అయితే ఈ పెంపు సరిపోదని, మరింత పెంచాలనే తదితర 18 డిమాండ్లతో ఆర్టిజన్లు సమ్మెకు దిగారు. బుధవారం జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావుతో ఉద్యోగ సంఘాల నేతలు జరిపిన చర్చలు ఫలించడంతో సమ్మె విరమించారు.