Aug 07,2023 10:43

అబుజా : జులై 26 తిరుగుబాటు ద్వారా అధికారం చేజిక్కించుకున్న సైనిక జుంటా గతంలో ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న మిలిటరీ ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు. తిరుగుబాటు తరువాత సైన్యం ఏర్పాటు చేసిన నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ది సేఫ్‌ గార్డింగ్‌ ఆఫ్‌ హౌమ్‌ లాండ్‌ (సిఎన్‌ఎస్‌పి) భద్రతకు సంబంధించి 1997- 2020 మధ్య ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న అయిదు సహకార ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపాడు. నైజర్‌ అంతర్గత వ్యవహారాల్లో ఫ్రాన్స్‌ జోక్యానికి ప్రతిగా తాము ఈ చర్య తీసుకున్నట్టు సైనిక పాలకుడు చెప్పాడు. ఫ్రాన్స్‌, అమెరికా, నైజీరియా,టోగో దేశాలతో సంబంధాలు తెగదెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించాడు. సిఎన్‌ఎస్‌పి నైజర్‌లో ఫ్రాన్స్‌ రేడియో, ఫ్రాన్స్‌ ఇంటర్నేషనల్‌ అనే రెండు మీడియా సంస్థల కార్యకలాపాలను నిలిపివేస్తూ ఒక డిక్రీ జారీ చేశారు. ఈ రెండు మీడియా సంస్థలు ఫ్రెంచి ప్రభుత్వ యాజమాన్యం కింద పనిచేస్తున్నవే. అలాగే మరికొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థల కార్యకలాపాలను కూడా నిలిపివేయాలని నిర్ణయించాడు. అలాగే ఫ్రాన్స్‌లో తన రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాడు.