Aug 30,2023 21:08

కొలంబో: ఆసియాకప్‌ క్రికెట్‌ టోర్నీలో ఆడేందుకు భారత ఆటగాళ్లు శ్రీలంక చేరుకున్నారు. బుధవారం ఉదయం కొలంబో ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వీడియోలను బిసిసిఐ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. కేఎల్‌ రాహుల్‌ 100% ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో అతడు జట్టుతో శ్రీలంకకు వెళ్లలేదు. ఈ టోర్నీ అనంతరం వన్డే ప్రపంచకప్‌ ఉన్న దృష్ట్యా టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనపై బిసిసిఐ దృష్టి సారించింది. ఈ ఏడాది ఆసియాకప్‌ శ్రీలంక, పాకిస్తాన్‌ వేదికగా హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహిస్తుండగా.. భారత్‌ ఆడే మ్యాచ్‌లకు శ్రీలంక వేదిక కానుంది. భారతజట్టు తన తొలి లీగ్‌ మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 2న పల్లెకెలె వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది. గత ఏడాది టి20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియాకప్‌ టైటిల్‌ను శ్రీలంక జట్టు చేజిక్కించుకోగా.. పాకిస్తాన్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఇప్పటివరకు అత్యధికంగా ఏడుసార్లు ఆసియాకప్‌ కైవసం చేసుకున్న భారత్‌.. ఈ సారి కూడా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది.