Mar 03,2023 21:15

న్యూఢిల్లీ : దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ మొత్తంగా 50 లక్షల కార్ల తయారీ మార్క్‌ను దాటినట్లు వెల్లడించింది. 5 మిలియన్‌ యూనిట్ల మైలురాయిని చేరడంతో తమ ఉద్యోగులు, ఖాతాదారులతో వేడుకలు జరుపుతున్నట్లు తెలిపింది. టాటా అల్ట్రోజ్‌, నెక్సాన్‌, ఫంచ్‌, టియాగో, టిగోర్‌, హారియర్‌, సఫారీ తదితర మోడళ్లను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. 2004లో తొలిసారి ఈ కంపెనీ 10 లక్షల యూనిట్ల మార్క్‌ను చేరగా.. 2015 నాటికి 30 లక్షలు, 2020 నాటికి 40 లక్షల యూనిట్ల తయారీకి చేరింది.

టాటా నెక్సాన్‌ ఇవి రికార్డ్‌ ప్రయాణం
టాటా నెక్సాన్‌ ఇవి కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు తక్కువ కాలంలో వేగంగా ప్రయాణించి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుందని ఆ కంపెనీ తెలిపింది. 95 గంటల 46 నిమిషాల్లో (4 రోజుల్లో) విజయవంతంగా 4003 కిలోమీటర్లు ప్రయాణించినట్లు వెల్లడించింది. భారత రహదారులపైన ఉన్న పబ్లిక్‌ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ల ద్వారానే ఇది సాధ్యపడిందని తెలిపింది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కోసం 21 చోట్ల 28 గంటల పాటు ఆగినట్లు వెల్లడించింది.