ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీశ్ సిసోడియా విషయంలో సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో వాదనలు వెంటనే ప్రారంభించాలని స్పష్టం చేసింది. సిసోడియాను ఎల్లకాలం జైలులోనే ఉంచలేరని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ట్రయల్ కోర్టులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ కేసులో వాదనలు ప్రారంభించాలని సూచించింది. సిసోడియా అరెస్టుకు ముందు గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకున్నారా? అంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టి ల ధర్మాసనం ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్ వీ రాజు స్పందిస్తూ.. లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకున్నాకే అరెస్టు చేసినట్లు తెలిపారు. ఉపముఖ్యమంత్రితో పాటు 18 శాఖల బాధ్యతలు చూసిన నేత లంచం తీసుకోవడం తీవ్రమైన విషయమని, సిసోడియాకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.










