Sep 16,2023 21:45
  • మొరాకోతో డేవిస్‌ కప్‌ మ్యాచ్‌

బెంగళూరు: మొరాకోతో జరుగుతున్న డేవిస్‌ కప్‌ ప్రపంచ గ్రూప్‌-1 పోటీలో తొలిరోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. తొలి సింగిల్స్‌లో శశికుమార్‌ ముకుంద్‌ మ్యాచ్‌ మధ్యలో గాయపడి పరాజయాన్ని చవిచూడగా.. సుమిత్‌ నాగల్‌ హోరాహోరీ పోరులో గెలిచాడు. తొలి సింగిల్స్‌లో శశికుమార్‌ ముకుంద్‌ 7-6, 5-7, 1-4తో వెనుకబడి ఉన్న దశలో గాయపడి ఓటమిని అంగీకరించారు. ప్రపంచ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో ముకుంద్‌ 365వ ర్యాంక్‌లో ఉండగా.. ప్రత్యర్ధి యాసెన్నె డ్లిమి 557వ ర్యాంక్‌లో ఉన్నాడు. ఇక రెండో సింగిల్స్‌లో సుమిత్‌ నాగల్‌ 6-3, 6-3తో మౌండెర్‌ ఆదామ్‌ను ఓడించాడు. దీంతో ఇరుజట్లు ఒక్కో గేమ్‌ను గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. ఆదివారం డబుల్స్‌ పోటీ జరగనుండగా.. సోమవారం రివర్స్‌ సింగిల్స్‌ పోటీలు జరగనున్నాయి.