Apr 15,2023 21:02
  • ఐఎంఎఫ్‌ విశ్లేషణ

వాషింగ్టన్‌ : ప్రపంచ విత్త రంగంలో ఒత్తిడి నెలకొందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొంది. దీంతో వృద్థి రేటుపై ప్రతికూల ప్రభావం పడుతోందని విశ్లేషించింది. ఇటీవల కాలంలో అమెరికా, స్విజ్జర్లాండ్‌లోని ఫైనాన్సీయల్‌ సెక్టార్‌లో చోటు చేసుకున్న సంక్షోభాల వల్ల ప్రపంచ దేశాల జిడిపి మందగించిందని పేర్కొంది. ఇకపై రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు మరింత వివేకంగా ఉండొచ్చని ఐఎంఎఫ్‌ విశ్లేషించింది. ''ఒపెక్‌ దేశాలు ఒక ప్రణాళికగా చమురు ఉత్పత్తి కోతలకు దిగడం వల్ల ఇప్పటికే అధిక ధరలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వినియోగదారుల వద్ద ఇతర ఖర్చులకు తక్కువగా నగదు ఉంటుంది. ఈ పరిణామం మాంద్యం ప్రమాదాలను మరింత పెంచుతుంది. ధరల ఒత్తిడి మరింత పెరుగొచ్చు.'' అని ఐఎంఎఫ్‌ పేర్కొంది. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం.. 2023లో ప్రపంచ వృద్థి రేటు 2.8 శాతానికి కుంచించుకుపోవచ్చు. గతేడాది ఇది 3.4 శాతంగా నమోదు కాగా.. వచ్చే ఏడాది 3 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. అభివృద్థి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో భారత వృద్థి రేటు 5.9 శాతానికే పరిమితం కావొచ్చని ఇటీవల ఐఎంఎఫ్‌ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. 2022-23లో 6.8 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. దీంతో పోల్చితే భారీ తగ్గుదలనే చోటు చేసుకోనుంది. మరోవైపు 2023-24లో భారత వృద్థి రేటు 6.3 శాతంగా ఉండొచ్చని ఇటీవల ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది.