
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భువనగిరి పల్లి ఆర్చి వద్ద ఉన్న శ్రీ చైతన్యలో ఉమ్మడి జిల్లా ఏజీఎం రమణయ్య ఆధ్వర్యంలో అట్టహాసంగా స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం ఓ ఆనవాయితీగా వస్తోందన్నారు. ఒలింపిక్స్ క్రీడల్లో మన దేశానికి మూడు బంగారు పతకాలు అందించిన గొప్ప క్రీడాకారుడు ధ్యాన్ చంద్ అని కొనియాడారు. క్రికెట్కు అంతగా వైభవం లేని రోజుల్లో హాకీ క్రీడ ద్వారా ఇండియా పేరు-ప్రతిష్టల్ని అంతర్జాతీయంగా చాటిచెప్పారన్నారు. మన దేశంలో హాకీ క్రీడకు ఆద్యుడిగా ధ్యాన్చంద్ను అభివర్ణిస్తుంటారన్నారు. 1928,1932, 1936 ధ్యాన్ చంద్ సారథ్యంలో ఇండియా హాకీ జట్టు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ దక్కించుకున్నదన్నారు. మెరుపు వేగంతో గోల్స్ చేయడం ధ్యాన్చంద్ ప్రత్యేకత అని, తన ఫుట్ వర్క్తో ఎదుటి ఆటగాళ్లను సులభంగా బోల్తా కొట్టించేవాడన్నారు. హాకీ క్రీడతో పాటు ఆర్మీ అధికారిగా అతడు దేశానికి చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించిందన్నారు. అతడి జయంతి రోజును 2012లో జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.