Sep 02,2023 16:47

ప్రజాశక్తి-ఎచ్చెర్ల (శ్రీకాకుళం) : మధుకాన్‌ గ్రానైట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్‌.అమ్మన్నాయుడు డిమాండ్‌ చేశారు. మధుకాన్‌ గ్రానైట్‌ కార్మికులకు రెండు సంవత్సరాల పెండింగ్‌ బోనస్‌ చెల్లించాలని, వేతనాలు పెంచాలని, కార్మికులందరికీ పి.ఎఫ్‌ అమలు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఎచ్చెర్ల మండలం కొంగరాం గ్రామం వద్ద గల మధుకాన్‌ గ్రానైట్‌ క్వారీ కార్మికులు క్వారీ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధుకాన్‌ గ్రానైట్‌ క్వారీ యాజమాన్యంను కార్మికులు పెరిగిన ధరల కనుగుణంగా వేతనాలు పెంచాలని.. రెండు సంవత్సరాలుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. చట్టబద్ధంగా చెల్లించాల్సిన బోనస్‌ రెండు సంవత్సరాలుగా చెల్లించలేదన్నారు. కార్మికులందరికీ పి.ఎఫ్‌ అమలు చేయాలని, హెల్త్‌ కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వెంటనే యూనియన్‌ తో చర్చలు జరిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రానైట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎమ్‌.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.