Apr 20,2023 21:44
  • ఒత్తిడిలో భారత మార్కెట్‌
  • అమ్మకాల్లో 20% పతనం

హైదరాబాద్‌ : భారత మొబైల్‌ మార్కెట్‌లో మందగమనం చోటు చేసుకుంది. ప్రస్తుత ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికం స్మార్ట్‌ఫోన్ల సరఫరాలో 20 శాతం పతనం చోటు చేసుకుందని కెనలిస్‌ ఓ రిపోర్ట్‌లో తెలిపింది. 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో 6 శాతం తగ్గుదలను చవి చూసిందని వెల్లడించింది. కెనలిస్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ ప్రకారం.. భారత మొబైల్‌ మార్కెట్‌కు 2023 సవాలుగా ప్రారంభమైంది. మార్కెట్‌ ఇప్పటికీ డిమాండ్‌ లేమితో పోరాడుతోంది. అమ్మకాలు తగ్గి స్టాక్‌ మిగిలిపోతోంది. కాగా.. క్రితం క్యూ1లో సామ్‌సంగ్‌ 63 లక్షల యూనిట్ల అమ్మకాలతో 21 శాతం మార్కెట్‌ వాటా కలిగి మార్కెట్‌ లీడర్‌గా నిలిచింది. వివో, షావోమిలను వెనక్కి నెట్టిన ఒప్పో 55 లక్షల యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలోకి వచ్చింది. వివో 54 లక్షల యూనిట్లతో మూడో స్థానంలో, షావోమి 5లక్షల యూనిట్లతో నాలుగో స్థానంలోకి, రియల్‌మి 29 లక్షల యూనిట్ల విక్రయాలతో ఐదో స్థానంలో ఉంది.
''భారత మొబైల్‌ మార్కెట్‌ కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ విక్రేతలు ఆశాజనకంగానే ఉన్నారు. మాస్‌ మార్కెట్‌ సెగ్మెంట్‌ ఇప్పటికీ నెమ్మదిగానే ఉంది. మొబైల్‌ మార్కెట్‌కు 2023 సవాలుతో కూడినదిగా ఉంది. ప్రీమియం సెగ్మెంట్‌ వృద్థికి సిద్ధంగా ఉంది. వినియోగదారులు క్రమంగా ప్రీమియం పరికరాలపై ఎక్కువ ఖర్చు చేయడానికి ఇష్టపడతారు. ఈ విభాగంలో విజయం సాధించాలంటే, బ్రాండ్‌లు తప్పనిసరిగా లభ్యత, స్థోమత, విలువకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుతం ఆపిల్‌, సామ్‌సంగ్‌ భారతదేశ స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతి వృద్థికి దోహదం చేస్తున్నాయి. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఎగుమతి వ్యూహాలపై దష్టి పెట్టాలి.'' అని కెనాలిస్‌ విశ్లేషకుడు సన్యామ్‌ చౌరాసియా పేర్కొన్నారు.