
- భారత్ ఖాతాలో మరో ఏడు పతకాలు
- 19వ ఆసియా క్రీడలు
హాంగ్జౌ: 19వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. సోమవారం భారత్కు 3వేల మీటర్ల స్టీపుల్ ఛేస్, లాంగ్ జంప్లో రజత పతకాలతో సహా మొత్తం ఏడు పతకాలు దక్కాయి. ఇందులో మూడు రజత పతకాలతోపాటు మరో నాలుగు కాంస్య పతకాలున్నాయి. ఇక మహిళల 3వేల మీటర్ల స్టీపుల్ ఛేస్లో పారుల్ ఛౌదరి రజతం, ప్రీతి కాంస్య పతకాలను సాధించారు. ఇక మహిళల లాంగ్జంప్లో అన్షీ సింగ్ రజతం, 4×400మీ. మిక్స్డ్ రిలేలో కాంస్య పతకాలు దక్కాయి. లాంగ్ జంప్ ఫైనల్లో భారత అథ్లెట్ అన్షీ సింగ్ 6.63మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచి రజత పతకం నెగ్గింది. ఈ విభాగంలో బంగారు పతకం గెలుచుకున్న చైనా అథ్లెట్ క్సియాంగ్ షికి కంటే కేవలం 0.10మీటర్లు మాత్రమే అన్షీ వెనుకబడింది. అలాగే హెప్టాథ్లాన్లో తెలంగాణ అమ్మాయి నందిని అగసారా కాంస్యం సాధించింది. దీంతో 19వ ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 60కు చేరింది.

4×400 మీటర్ల మిక్స్డ్ రిలేలో కాంస్యం
4×400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత జట్టు రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. అంతేగాక ఇవాళ స్టీపుల్ చేజ్లో భారత్కు మూడు పతకాలు వచ్చాయి.

400మీ. హర్డిల్స్లో పిటి ఉష రికార్డు సమం..
400మీటర్ల హర్డిల్స్ క్వాలిఫైడ్ రౌండ్స్లో విత్య రామ్రాజ్ 55.42సెకన్లలో గమ్యానికి చేరి పిటి ఉష రికార్డును సమం చేసింది. 1984లో జరిగిన ఒలింపిక్స్లో పిటి ఉష 55.42 సెకన్ల టైమింగ్తో 400మీటర్ల హర్డిల్స్ రేసు పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. అప్పటి నుంచి దాదాపు 39ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును ఇప్పుడు విత్య రామ్రాజ్ సమం చేసింది. ఇదే క్రమంలో ఫైనల్స్కు విత్య రామ్రాజ్ అర్హత సాధించింది.

మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్లో కాంస్యం
మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్లో సుతీర్థ ముఖర్జి, ఐహిక ముఖర్జిలతో కూడిన ఇండియన్ టీమ్ కాంస్య పతకం సాధించింది. ఆసియా క్రీడల చరిత్రలో మహిళల టీటీ డబుల్స్లో భారత్కు కాంస్య పతకం రావడం ఇదే తొలిసారి. సోమవారం ఉదయం జరిగిన సెమీఫైనల్లో ఉత్తర కొరియాకు చెందిన చా సుయోంగ్, పాక్ సుగ్యోంగ్ జోడి చేతిలో భారత్ పరాజయం పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది.
హాకీ సెమీ ఫైనల్స్లోకి భారత్.. చివరి లీగ్లో 12-0 తేడాతో బంగ్లాదేశ్పై గెలుపు
భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతున్నది. పూల్-ఎలో జరిగిన అన్ని లీగ్ మ్యాచ్లలో భారత్ భారీ గోల్స్ తేడాతో ఘన విజయాలు నమోదు చేసింది. సోమవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో కూడా బంగ్లాదేశ్పై 12-0 తేడాతో భారత్ విజయం సాధించింది. దాంతో పూల్-ఎ నుంచి టేబుల్ టాపర్గా భారత హాకీ జట్టు సెమీఫైనల్స్లో ప్రవేశించింది. సెమీస్లో గెలిస్తే భారత్కు పతకం ఖాయం కానుంది. కాగా, పూల్-ఎ లో ఇప్పటి వరకు జరిగిన ఐదు లీగ్ మ్యాచ్లలో భారత్ ఏకంగా 58 గోల్స్ సాధించింది. అందులో 13 స్వర్ణాలు, 20 రజతాలు, 19 కాంస్యాలు ఉన్నాయి.
పురుషుల క్రికెట్ క్వార్టర్ఫైనల్స్...
భారత్ × నేపాల్ (ఉ.6.30గం||లకు)
పాకిస్తాన్ × హాంకాంగ్(ఉ.11.30గం||లకు)