వరంగల్: ఇటీవల కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమైంది. దాదాపు ఆరు గంటల పాటు సభ్యులు విచారణ జరిపారు. అనంతరం విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ మోహన్ దాస్ మాట్లాడుతూ.. ఈ నెల 14న హాస్టల్లో ర్యాగింగ్ జరిగిందని నిర్థారించారు. ర్యాగింగ్కు పాల్పడిన ఏడుగురిపై కేసులు పెట్టినట్టు చెప్పారు. ఏడాది పాటు హాస్టల్లో అనుమతి నిరాకరించామని.. ఏడుగురినీ మూడు నెలల పాటు సస్పెండ్ చేసినట్టు తెలిపారు. మరో 20మంది విద్యార్థులకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. తమ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరగడం ఇదే తొలిసారన్నారు. ర్యాగింగ్ ఘటనలో పోలీసుల విచారణ కొనసాగుతోందని అన్నారు.










