
ముంబయి : ముంబయిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మైనర్లు సహా ఏడుగురు సజీవదహనమైనట్లు అధికారులు తెలిపారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గోరేగావ్లోని ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 30 మందిని రక్షించినట్లు బృహన్ ముంబయి మునిసిపల్ కార్పోరేషన్ (బిఎంసి) అధికారి ఒకరు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.
ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవదహనం కాగా, మరో 40 మంది గాయపడ్డారు. వారిలో 12 మంది పురుషులు, 28 మంది మహిళలు ఉన్నారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ మంటల్లో పలు ద్విచక్రవాహనాలు, కార్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.