న్యూఢిల్లీ : బంగారం ధరలు భారీగా పెరగడంతో ప్రజలు తమ వద్ద ఉన్న పాత అభరణాల అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. 10 గ్రాముల పసిడి ధర రూ.60వేలు దాటడంతో అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారని అభరణాల వర్తకులు తెలిపారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది వినియోగదారుల పాత ఆభరణాల అమ్మకాలు 25 శాతం మేర అధికంగా జరిగాయని పేర్కొన్నారు. భారీ స్థాయిలో పాత బంగారం అమ్మకాలు పెరగడానికి ప్రధానంగా అధిక ధరలే కారణమన్నారు. పిల్లల చదువుల ఖర్చుల కోసం కొంత మంది పాత బంగారాన్ని అమ్మేస్తున్నారని రిద్డీసిద్ధీ బులియన్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్విరాజ్ కొఠారి పేర్కొన్నారు. సాధారణంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో బంగారం కొనుగోళ్లు తగ్గుతాయన్నారు. మరోవైపు ఉన్న పాత అభరణాల అమ్మకాలు పెరగడం విశేషమన్నారు.










