Nov 15,2023 21:08

న్యూఢిల్లీ : సహారా గ్రూపు అధినేత, వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ మంగళవారం రాత్రి మరణించారు. 75 ఏళ్ల రారు ముంబయిలోని ఓ ప్రయివేటు హాస్పిటల్‌లో పలు దీర్ఘకాల రోగాలకు తోడు గుండె పోటుతో కన్ను మూశారు. బీహార్‌లోని ఆరారియాలో 1948 జూన్‌ 10న జన్మించిన రారు.. గోరఖ్‌పూర్‌లోని ప్రభుత్వ టెక్నికల్‌ ఇన్స్‌ట్యూట్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. 1976లో నష్టాల్లోని ఒక చిన్న చిట్‌ఫండ్‌ సంస్థను కొనుగోలు చేసి.. అనంతరం సహారా పరివార్‌గా మార్చి వ్యాపారంలోకి వచ్చారు. ఈ తర్వాత ఫైనాన్స్‌, రియల్‌ ఎస్టేట్‌, మీడియా, ఆతిథ్య రంగాల్లోకి ప్రవేశించారు. కాగా.. 2011 సమయంలో రెండు సహారా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు నిబంధనలకు విరుద్దంగా ప్రజల వద్ద నుంచి వేల కోట్లు సమీకరించాయి. దీనిపై సెబీ విచారణ జరపడం.. కేసు సుప్రీంకోర్టుకు చేరడం.. రారు జైలు కావడంతో సహారా ప్రతిష్ట చాలా వరకు మసకబారింది. మదుపర్ల నుంచి సమీకరించిన కోట్ల కొద్దీ నగదును రిఫండ్‌ చేయాల్సిందిగా సెబీ కోరగా ఆయన విస్మరించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆయన్ను తిహార్‌ జైలుకు పంపింది. ప్రస్తుతం పెరోల్‌పై బయట ఉన్నారు.

సెబీ వద్ద రూ.25వేల ఫండ్స్‌..
సుబ్రతా రారు చనిపోయినప్పటికీ ఇన్వెస్టర్లకు ఇవ్వాల్సిన రూ.25,000 కోట్ల నిధులు తమ వద్ద ఉన్నాయని కాపిటల్‌ మార్కెట్‌ రెగ్యూలేటరీ సంస్థ సెబీ వెల్లడించింది. సహారా ఇండియా రియల్‌ ఎస్టేట్‌ కార్పొరేషన్‌, సహారా హౌసింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్లు 2011లో నిబంధనలకు విరుద్దంగా 3 కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి వేల కోట్లు సమీకరించింది. సుప్రీం ఆదేశాలతో 15 శాతం వడ్డీతో కలిపి దాదాపు రూ.24వేల కోట్ల మొత్తాన్ని మదుపర్లకు చెల్లించాల్సి ఉంది. 2023 మార్చి 31 నాటికి వివిధ జాతీయ బ్యాంకుల్లో దాదాపు రూ.25,163 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని సెబీ పేర్కొంది. వీటి చెల్లింపుల కోసం కేంద్రం సెంట్రల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ సొసైటీని ఏర్పాటు చేసింది. గడిచిన ఆగస్ట్‌ నుంచి తొమ్మిది మాసాల్లో చెల్లింపులు చేయాలని నిర్దేశించుకుంది.