Jul 09,2023 21:30

రష్యా: రష్యా నుంచి చౌకగా భారత్‌కు లభిస్తున్న చమురు ధరల్లో మార్పులు రానున్నాయి. డిస్కౌంట్‌ 4 డాలర్లకు తగ్గిపోనున్నట్లు సమాచారం. మరోవైపు రష్యా ఏర్పాటు చేసిన చమురు రవాణా సంస్థల చార్జీలు మాత్రం ఇప్పటికీ అధికంగానే ఉన్నాయి. దీంతో దేశీయంగా చమురు ధరలపై ప్రతికూల ప్రభావం పడనుంది.ప్రస్తుతం పశ్చిమ దేశాల ధరల నియంత్రణ కారణంగా పీపా చమురును రష్యా 60 డాలర్ల కంటే తక్కువ ధరకే భారత్‌కు విక్రయిస్తోంది. కానీ, బాల్టిక్‌, నల్లసముద్రం నుంచి భారత్‌లోని పశ్చిమ తీరానికి దీనిని చేర్చడానికి షిప్పింగ్‌ ఛార్జీలను పీపాకు 11 డాలర్ల నుంచి 19 డాలర్లు వసూలు చేస్తోంది. ఇది మార్కెట్‌ ధర కంటే చాలా అధికం. ఇందుకోసం రష్యా వద్ద ఉన్న 100కుపైగా ట్యాంకర్లలో కొన్నింటిని భారత్‌కు చమురు కోసం తీసుకొన్నారు. వీటికి అధికధరలను వసూలు చేస్తున్నారు.గతేడాది ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి భారత్‌కు యురల్‌ గ్రేడ్‌ చమురు సరఫరా పెరిగింది. ఈ క్రమంలో ప్రతిపీపా చమురుపై బ్రెంట్‌ క్రూడ్‌తో పోలిస్తే 30 డాలర్లకు పైగా డిస్కౌంట్‌ ఇచ్చింది. కానీ, ఇప్పుడు అది మెల్లగా 4 డాలర్లకు తగ్గించేసింది.