Nov 03,2023 12:50

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం (ఏలూరు) : మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ... శుక్రవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు స్థానిక ఆర్‌డిఒ ఆఫీస్‌ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘ అధ్యక్షులు పి.సూర్యరావు మాట్లాడుతూ ... జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయినా ఆ మాటే మరిచి పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే మున్సిపల్‌ కార్మికులను గుర్తించి ఆఫ్కాస్‌ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని పర్మినెంట్‌ చేయాలని కోరారు. కనీస వేతనాలు 11వ పిఆర్సి ప్రకారం రూ.26,000 అమలు చేయాలని కోరారు. పారిశుధ్య కార్మికుల టౌన్‌ అధ్యక్షులు బి.బాలరాజు మాట్లాడుతూ ... పారిశుధ్య కార్మికులు నిరంతరం దుమ్ముధూళితో విధులు నిర్వహిస్తున్నారని, తమ గురించి ప్రభుత్వం ఒక్క మాటైనా మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా ఈ పారిశుధ్యంలో పనిచేస్తున్న తమకు రక్షణ లేదని ఇప్పటికే కార్మికుల అనేక వ్యాధులతో మరణిస్తున్నారని మరణించిన వారి ప్లేస్‌ లో వారి కుటుంబ సభ్యులకి అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం ఏవో సోమేశ్వరరావు కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు టౌన్‌ కార్యదర్శి షేక్‌ సుభాషిని కార్మికుల సమస్యలను అధికారికి వివరించారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజున నిరసన కార్యక్రమం చేశామని. సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ నెలాఖరున కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చలో విజయవాడ కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆ సంఘ కార్యదర్శి కొత్తూరు లక్ష్మణ్‌, గున్నే వెంకటేష్‌, ఉష, ఇంగుర్తి లక్ష్మి, తుంగమంగా పెంటయ్య, దోసూరు మంగ, మర్రి మేరి, బాలయ్య, రాంబాబు, ప్రతినిధులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.