రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాలు ముట్టడి : పలుచోట్ల కార్మిక నేతలు, కార్మికుల అరెస్టులు

- ఒంగోలు మున్సిపల్ కార్యాలయం ముట్టడి : కార్మికుల నిరసనతో వెనుదిరిగిన అధికారులు
ప్రకాశం : ఎపి మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ... నేడు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. అందులో భాగంగా ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులంతా తమ విధులను బహిష్కరించి కార్యాలయాన్ని ముట్టడించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు, సిఐటియు నాయకులు కలిసి ముట్టడించారు. కార్యాలయ ప్రధాన ద్వారాన్ని మూసివేసి నిరసన తెలిపారు. కార్యాలయానికి వచ్చిన ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్, డిఈ షేక్ సుభానిలు కార్మికుల నిరసనను చూసి వెనుదిరిగారు. కార్మికుల ఆందోళన కొనసాగుతోంది.

రాజాం మున్సిపల్ కార్యాలయం ముట్టడి
విజయనగరం : మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని, ఎన్నికల ముందు పాదయాత్రలో సిఎం జగన్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్.రామ్మూర్తి నాయుడు డిమాండ్ చేశారు. రాజాం మున్సిపల్ కార్యాలయంను ముట్టడించారు.

పిడుగురాళ్ళ మున్సిపల్ కార్యాలయం ముట్టడి
మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ... పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయాన్ని సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ముట్టడించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆంజనేయులు నాయక్ ప్రసంగించారు.

పార్వతీపురంలో కార్మికుల అరెస్టులు
మన్యం : పార్వతీపురంలో మున్సిపల్ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. కార్మికుల ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట, వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు కార్మికులను బలవంతపు అరెస్టులు చేశారు.










