Sep 14,2023 22:25

రేపు బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్‌
కొలంబో: ఆసియా కప్‌ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. శుక్రవారం నామమాత్రపు సూపర్‌4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇప్పటికే ఫైనల్‌కు చేరిన భారతజట్టు సీనియర్లకు విశ్రాంతినిచ్చి బెంచ్‌కే పరిమితమైన ఆటగాళ్లకు అవకాశం కల్పించనుంది. సూపర్‌-4లో వరుసగా రెండు విజయాలు సాధించి భారత్‌ ఇప్పటికే ఫైనల్‌ చేరుకోగా.. బంగ్లాదేశ్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో వర్క్‌లోడ్‌లో భాగంగా భాగంగా బంగ్లాతో మ్యాచ్‌కు కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశముంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు సీనియర్లు విరాట్‌ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రాకు రెస్ట్‌ ఇచ్చే ఛాన్స్‌ ఉంది. గురువారం ఉదయం నిర్వహించిన ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ సెషన్‌కు ఈ ముగ్గురు ఆటగాళ్లతోపాటు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య దూరంగా ఉన్నారు. వెన్నునొప్పి కారణంగా సూపర్‌-4లో మొదటి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌ కోలుకుని ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గన్నాడు. ఫిజియోలు ఇచ్చే ఫిట్‌నెస్‌ రిపోర్ట్‌ను బట్టి అతడు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆడటం ఆధారపడి ఉంది. ఇక, అయ్యర్‌ స్థానంలో వచ్చి రాణించిన కేఎల్‌ ఈ మ్యాచ్‌లో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. రోహిత్‌ శర్మ మ్యాచ్‌కు దూరంగా ఉంటే హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి ఓపెనింగ్‌ చేస్తాడు. మిడిల్‌ ఆర్డర్‌లో సూర్యకుమార్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఆడే అవకాశముంది. బుమ్రా స్థానంలో మహమ్మద్‌ షమి తుది జట్టులోకి రావొచ్చు. వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న సిరాజ్‌కు కూడా విశ్రాంతి ఇస్తే అతడి స్థానంలో ప్రసిద్ధ్‌ కృష్ణకు చోటు దక్కొచ్చు.