Oct 16,2023 21:40

హైదరాబాద్‌: భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్ రాయ్ డెన్మార్క్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆసియా క్రీడల్లో గాయపడ్డ ప్రణయ్.. గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆసియా క్రీడలు ముగిసిన తర్వాత భారత్‌కు చేరిన ప్రణయ్ కు ఎంఆర్‌ఐ స్కాన్‌లో తీవ్రంగా గాయపడినట్లు తేలింది. దీంతో అతనికి మరో 2-3వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు నిర్థారించారు. ఇక ఆసియా క్రీడల సింగిల్స్‌ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన ప్రణయ్.. పతకం నెగ్గే క్రమంలో వెన్నునొప్పికి గురయ్యాడు. దీంతో డెన్మార్‌ ఓపెన్‌ సూపర్‌-750, ఫ్రెంచ్‌ ఓపెన్‌ సిరీస్‌ల నుంచి వైదొలిగాడు. దీంతో డెన్మార్క్‌ ఓపెన్‌లో ప్రణయ్ ప్రత్యర్ధి థాయ్ లాండ్‌కు చెందిన కంటపోర్న్‌కు తొలిరౌండ్‌లో బై లభించగా.. రెండోరౌండ్‌లో 6వ సీడ్‌ షి-యుఫీ(చైనా)తో తలపడనున్నాడు. ఇక లక్ష్యసేన్‌, పివి సింధు, కిదాంబి శ్రీకాంత్‌ తదితర ఆటగాళ్లు ఈ రెండు టోర్నీల బరిలోకి దిగుతున్నారు.