
'కన్యాశుల్కం' నాటక రచయిత పిల్లలూ, ఈ రోజు తెలుగు రచయిత, కవి గురజాడ అప్పారావు జయంతి. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా !
గురజాడ అప్పారావు విశాఖ జిల్లా, యస్.రాయవరంలో, మేనమామ ఇంట్లో 1862 సెప్టెంబరు 21న, వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. అతనికి శ్యామలరావు అనే తమ్ముడు ఉన్నాడు. గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది. తన పదవ ఏట వరకు అప్పారావు చీపురుపల్లిలో చదువుకున్నారు. తర్వాత, వారి తండ్రి చనిపోవడంతో విజయనగరానికి వచ్చారు. ఇక్కడ చాలా పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించారు. ఈ సమయంలో అప్పటి ఎమ్. ఆర్. కళాశాల ప్రధానాధ్యాపకులు సి. చంద్రశేఖర శాస్త్రి గురజాడను చేరదీశారు. అక్కడే ఉంటూ మెట్రిక్యులేషను, ఎఫ్.ఎ చేశారు. ఇదే సంవత్సరంలో ఏం. ఆర్. ఉన్నత పాఠశాల్లో ఉపాధ్యాయునిగా చేరారు. విజయనగరంలో బి.ఏ చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి అతనికి సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు. ప్రతి ఏటా గురజాడ జన్మదిన వేడుకను యస్.రాయవరం ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు.
గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. హేతువాది. 19వ శతాబ్దంలోను, 20వ శతాబ్ది మొదటి దశకంలోనూ గురజాడ చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. అతను ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేశారు. వీరి 'కన్యాశుల్కము' నాటకానికి జనంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. 'అభ్యుదయ కవితా పితామహుడు' అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. గురజాడకి 'కవి శేఖర' అనే బిరుదు కూడా ఉంది. గిడుగు రామమూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించారు. అప్పట్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కము, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథా వస్తువు. 1892లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. ఇప్పుడు మనకు దొరుకుతున్న 'కన్యాశుల్కము' రెండవ కూర్పును 1909లో రచించారు.
1910లో గురజాడ రాసిన 'దేశమును ప్రేమించుమన్నా' అనే దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధి పొందింది. మద్రాసు విశ్వవిద్యాలయం బోర్డు అఫ్ స్టడీస్లో నియమించబడ్డారు. అదే సంవత్సరంలో, స్నేహితులతో కలిసి ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రారంభించారు. అప్పారావు పదవీ విరమణ చేసిన తర్వాత అనారోగ్యంతో బాధపడ్డారు. 1915 నవంబరు 30న మరణించారు.