Oct 17,2023 08:48
  • ఐఓసి ఓటింగ్‌లోనూ సభ్యుల ఆమోదం

ముంబయి: 2028 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌నుంచి క్రికెట్‌ సహా ఐదు క్రీడలకు అవకాశం దక్కింది. సోమవారం ముంబయిలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐఓసీ) సదస్సులో ఓటింగ్‌ నిర్వహించగా... ఇద్దరు సభ్యులు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఐదు క్రీడలను చేర్చాలనే ప్రతిపాదనకు ఆమోదం లభించిందని ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ వెల్లడించారు. క్రికెట్‌(టి20)తో పాటు బేస్‌బాల్‌- సాఫ్ట్‌బాల్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, లక్రాస్‌ (సిక్సస్‌), స్క్వాష్‌లకు కూడా ఒలింపిక్స్‌లో అవకాశం కల్పించారు. ఐఓసి నిబంధనల ప్రకారం ఆతిథ్య నగరం ఈ క్రీడల ప్రవేశానికి ఆమోదం తెలిపితే సరిపోతుంది. టి20 ఫార్మాట్‌లో పురుషుల, మహిళల క్రికెట్‌ పోటీలు జరగనున్నాయి. లాస్‌ ఏంజిలెస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టాలనే నిర్వాహకుల ప్రతిపాదనను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ఎగ్జిక్యూటివ్‌ బోర్డు శుక్రవారం ఆమోదించిన సంగతి తెలిసిందే. 1900 పారిస్‌ ఒలింపిక్స్‌లో గ్రేట్‌ బ్రిటన్‌ ఫైనల్‌కు చేరి ఫ్రాన్స్‌పై 158పరుగుల తేడాతో గెలిచింది. నెదర్లాండ్స్‌, బెల్జియం జట్లు క్రికెట్‌కు దూరంగా ఉన్నాయి. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కడం పట్ల ఐసిసి ఛైర్మన్‌ గ్రెగ్‌ బెర్ల్కే హర్షం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు మరోదఫా అవకాశం లభించడానికి, మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఐఓసి సభ్యురాలు నీతా అంబానీ మాట్లాడుతూ.. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడాన్ని స్వాగతిస్తున్నట్లు, క్రికెట్‌ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రజలు ఇష్టపడే క్రీడల్లో ఒకటని, అత్యధికమంది వీక్షిస్తారన్నారు. అలాగే కొత్త తరానికి నూతన ఉత్సాహాన్నిస్తుందని ఆమె వెల్లడించారు.