
- నేడు ప్రపంచ హృదయ దినం
మనిషి నేటి ఆధునిక జీవన శైలి ప్రభావం... మితిమీరిన ఆహారపు అలవాట్లు... నిద్రలేమి సమస్యలు... సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేవి వంటి కారణాలతో గుండె జబ్బుల బారిన పడుతున్నాడు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ ఈ వ్యాధి బారిన పడేవారి సంఖ్య వయసుతో నిమిత్తం లేకుండా రానురానూ పెరిగిపోతుండటం ఆందోళన కల్గించే విషయం. ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో చూసినా మరణాల్లో 30 శాతం గుండె సంబంధిత వ్యాధులతోననే గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గుండెకు ముప్పు ఎప్పుడు వస్తుందో తెలుసుకుంటే దానిని అడ్డుకోగల మార్గాలు తెలుస్తాయి. నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఫలితంగా అనేక సమర్ధ పరికరాలు, ఆధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. గుండె జబ్బులపై అవగాహన, చికిత్సలో డాక్టర్ జుజ్జూరు శ్రీమన్నారాయణ అంతర్జాతీయ స్థాయిలో హృద్రోగ నిపుణులు. విజయవాడ నక్కలరోడ్డులోని ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్టు ఆయన. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు (అన్ని వయస్సుల వారికి) సులభంగా, నాణ్యమైన వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు చేయటంలో ఆయన విశేషంగా పేరుగాంచారు. గుండె సంబంధిత చికిత్సలు, నివారణా పద్ధతులను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
మానవుడి శరీరంలో అతి ముఖ్యమైన అవయవం గుండె. శరీరానికంతటికీ రక్తాన్ని సరఫరా చేయటంతోపాటుగా అనేక రకాల విధులను హృదయం (గుండె) నిర్వర్తిస్తుంది. అయితే దాని నిర్వహణ తీరుపైన ఒత్తిడి పెంచితే వ్యాధుల బారిన పడతాం. సరైన ఆహారపు అలవాట్లు, మెరుగైన జీవనశైలి, ప్రశాంతమైన వాతావరణంలో ఉండగలిగితే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరబోవు. ప్రతి ఒక్కరిలోనూ తమ గుండె బలహీనపడిందని తెలియగానే భయం, బాధ, ఆందోళన వంటివి కలుగుతాయి. పై లక్షణాలు ఉంటే వ్యాధిని మరింత తీవ్రం చేస్తాయి. అలా కాకుండా తమకు వచ్చిన వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి.

జబ్బు ముదరకుండా చూసుకోవాలి
గుండె జబ్బుల్లో అనేక రకాలున్నాయి. వాటికి సకాలంలో గుర్తించగలగాలి. అప్పటికి జబ్బు స్థాయి ఏమిటో తెలుసుకోగలగాలి. అప్పుడు సరైన చికిత్స అందించగలగాలి. జబ్బు ముదిరిన కొద్దీ నిర్ధారణ తేలికైనా, చికిత్స కష్టం. ఆ స్థితిలో కొన్ని చికిత్సలకు సరైన చికిత్స అందించటం కష్టమవుతుంది. రోగ నిర్ధారణ చేసి సరైన చికిత్సనిచ్చినా కొన్ని గుండె జబ్బులు తగ్గవు. ఆ జబ్బు ఎందుకు వచ్చిందో తెలుసుకుని కారణానికి చికిత్స చేయనంతకాలం కష్టం. ఏ రోగికైనా మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చి, గుండె బాగా దెబ్బతిని పెద్దదైందనుకోండి. అప్పుడు గుండెకు శస్త్ర చికిత్స చేసి కొంత కండరాన్ని తీసేస్తారు. గుండె పరిమాణాన్ని తగ్గిస్తే ఆ రోగికి మళ్లీ బాగా స్వస్థత చేకూరే అవకాశం ఉంది. ఇవేవీ పనిచేయలేదనుకుంటే అప్పుడు గుండె మార్పిడి గురించి ఆలోచించాలి. 55 ఏళ్ల లోపు వయస్సు వారు మిగతా అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటే గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు అర్హులు.
98 శాతం గుండె శస్త్ర చికిత్సలు విజయవంతం
గుండె రంధ్రాలను మూయటం, కవాటాలను (వాల్స్) మార్చడం, బైపాస్ సర్జరీ లాంటి శస్త్ర చికిత్సలు చాలా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం గుండె శస్త్ర చికిత్సల్లో కొత్త పద్ధతులు రోగులకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయి. హార్ట్లంగ్ మిషిన్లో మత్తు ఉంచే పద్ధతులతోపాటుగా శస్త్ర చికిత్స చేసే నైపుణ్యాల్లో కూడా కొత్త యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. పెద్ద వాళ్లలో మేజర్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్లలో కూడా 98 శాతం ఆపరేషన్లు విజయవంతమవుతున్నాయి. అయితే ఇంకా కొంతమంది రోగుల్లో గుండె, మూత్రపిండాలు దెబ్బతిన్న వారిలోనూ, రక్తప్రసరణ లోపాలున్న వాళ్లలో గుండె శస్త్ర చికిత్సల్లో కొంత రిస్క్ ఉంటుంది. గుండె ఆపినప్పుడు ఉపయోగించే ఆర్టిఫీిషియల్ సర్క్యూట్తో రక్తస్రావం, పక్షవాతం రావొచ్చు. అలాగే బ్రస్ట్బోన్ మీద ఇచ్చే కోత మీద ఒక్కోసారి స్కాచ్ (మచ్చ) పెద్దదై (కిలాయిడ్) దురదలు పుట్టడంతోపాటు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. శస్త్ర చికిత్స జరిగిన తర్వాత రోగి ఒక వారం నుంచి పది రోజుల వరకూ ఆసుపత్రిలో గతంలో ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది.

గుండె ఆపకుండానే బైపాస్ సర్జరీ
గతంలో మాదిరిగా రక్తనాళాలను ఆర్ట్ఫిషియల్ హార్ట్లంగ్ మిషన్తో కలిపి గుండె శస్త్ర చికిత్సలు చేయకుండా గుండె కొట్టుకుంటునప్పుడే బైపాస్ సర్జరీ చేస్తున్నాం. పెద్ద కోతలు లేకుండా చిన్న రంధ్రాల్లో నుంచి పొట్టలో ల్యాప్రోస్కోపిప్ సర్జరీలను ఎలా చేస్తున్నారో, అలాగే కొన్ని గుండె శస్త్ర చికిత్సలను చేసే విధానాలు వచ్చాయి. ఇలా గుండెలో రంధ్రాలకు, కొన్ని రకాల కవాటాలను మార్చటానికి మినిమల్లీ ఇన్ వేజ్ సర్జరీలు చేస్తున్నాం. తోరాకో స్కోపిక్ పద్ధతి ద్వారా రోబోట్స్ని ఉపయోగించి గుండె చికిత్సలు విజయవంతం చేయొచ్చు. ఇలా చేయటం వల్ల రోగ శస్త్ర చికిత్స అయిన రెండు, మూడు రోజుల్లోనే రోగి ఇంటికి వెళ్లొచ్చు. గుండె రక్తనాళాల్లో బ్లాక్ అయినప్పుడు అక్కడ కాల్షియం పేరుకుపోయి గట్టిగా అవుతుంది. దీనినే క్రానిక్ టోటల్ ఆక్లూజన్ అంటారు. కాల్షియం పేరుకుపోతే ఎక్స్రే ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటి బ్లాక్స్ దగ్గరకు గ్రైండిగ్ కేథటార్వైర్ని పంపుతాము. యాంజియో ప్లాస్టీలో టార్పస్ స్క్రూ కదలికలతో కాల్షియం గట్టిపొరను చీల్చుకుంటూ ముందుకు వెళ్లి రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగించొచ్చు. గుండె కొట్టుకునే వేగం బాగా తగ్గిపోతున్నా, విఫలమయ్యే పరిస్థితి నెలకొన్నా, స్పృహతప్పే పరిస్థితి ఎదురవుతున్నా పేస్మేకర్లు అమర్చటం ద్వారా ఉపయోగం ఉంటుంది.
ఆత్యాధునిక వోసీటీ సేవలు
ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్లో ఆర్టికల్ కాహెన్స్ టొమోగ్రఫీ సేవలు గత రెండేళ్లుగా అందిస్తున్నాం. ఈ పరికరంతో చేసే వైద్య సేవలు ఎంతో నాణ్యమైనవి. వోసీటీ పరికరం ద్వారా గుండె లోపలి భాగంలోని రక్తనాళాల పూడికను పసిగట్టొచ్చు. యాంజియోగ్రామ్ టెస్ట్ కంటే ఎక్కువ ఫలితాలను వోసీటీ ఇస్తుంది.
ఇంటర్వ్యూ : యడవల్లి శ్రీనివాసరావు
ఫొటోలు : టి.వి.రమణ