Jun 12,2023 20:54

ఢిల్లీ : భారత్‌లో పన్ను చెల్లించడం శిక్షలాంటిదని భారత్‌పే మాజీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్‌ గ్రోవర్‌ విమర్శించారు. దేశంలో అమలవుతోన్న పన్ను విధానంలో అనేక లోపాలు ఉన్నాయన్నారు. విదేశాల్లో ఉపయోగిస్తున్న క్రెడిట్‌ కార్డ్‌లపై గత నెలలో కేంద్ర ప్రభుత్వం విధించిన 20 శాతం పన్ను విధానాన్ని ఆయన తప్పుబట్టారు. మరోవైపు రాజకీయ పార్టీలకు ఇచ్చే డొనేషన్లపై మాత్రం ఎలాంటి పన్ను లేదన్నారు. పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయాల్లో ప్రభుత్వానికి 30-40 శాతం పన్ను చెల్లిస్తున్నారని అన్నారు. పన్ను చెల్లింపుదారులు ఇతరులకు ఉపయోగపడుతున్నారు తప్పా ప్రతిగా వారికంటూ ఎలాంటి ప్రయోజనడం ఉండడం లేదన్నారు. రూ.10 సంపాదిస్తే అందులో రూ.4 ప్రభుత్వానికి పన్నుగా చెల్లిస్తున్నారు. అంటే.. ఏడాదికి 3-5 నెలలు పాటు ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు. అయినా ఎంతకాలం ఇలా ప్రభుత్వానికి ఊడిగం చేయాలని ప్రశ్నించారు. వ్యాపారులకు పన్ను నుంచి ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసని అన్నారు. కానీ ఉద్యోగుల పరిస్థితి అలా కాదు. వారి ఆదాయంలో ముందే టిడిఎస్‌ కోత పడుతుంది. అదే విధంగా వారు కొనే వస్తువుల పైనా 18 శాతం జిఎస్‌టి పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో పన్ను చెల్లించడమమంటే ఓ శిక్షనేనని విమర్శలు గుప్పించారు. ప్రతి ఒక్కరూ 10-15 శాతం పన్ను చెల్లించేలా చూడాలన్నారు. దాంతో ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు.