Apr 01,2023 21:08

న్యూఢిల్లీ : సామాన్యులను ఇబ్బంది పెట్టే కేంద్ర ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రూ.1000 జరిమానాతో పాన్‌ా ఆధార్‌తో అనుసంధానంపై ఆందోళనలు నెలకొనగా.. తాజాగా చిన్న మొత్తాల ఖాతాల వినియోగదారులను ఇబ్బంది పెట్టే మరో నిర్ణయం తీసుకుంది. తపాళ శాఖలో తెరిచే చిన్న మొత్తాల పొదుపు ఖాతాలకు కూడా పాన్‌, ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నూతన నిబంధన ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. పిపిఎఫ్‌, సుకన్య సమృద్థి యోచన, నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎస్‌సి), సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌, ఇతర ఏ పోస్ట్‌ ఆఫీసు చిన్న మొత్తాల పొదుపు పథకాలను తెరువడానికి అయినా పాన్‌, ఆధార్‌ కార్డ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆధార్‌ నంబర్‌ లేకుండా ఈ ఖాతాలు తెరిచిన ఖాతాదారులు 2023 సెప్టెంబర్‌ 30 లోగా సంబంధిత కార్యాలయాల్లో ఆధార్‌కార్డ్‌ సమర్పించాలని స్పష్టం చేసింది. ఇకపై కొత్త ఖాతాలు తెరిచే వారు ఆధార్‌ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఒక వేళ ఆధార్‌ లేకుండా కొత్త అకౌంట్‌ పొందితే ఖాతా తెరిచిన ఆరు నెలల్లోగా సంబంధిత కార్యాలయంలో ఆధార్‌ నంబర్‌ సమర్పించాలి. లేకపోతే ఖాతాను స్తంభింపజేస్తారు. మరోవైపు ఖాతాలో రూ.50వేల కంటే ఎక్కువ నగదు, పొదపు ఉన్నప్పుడు పాన్‌ కార్డ్‌ను తప్పనిసరిగా సమర్పించారు. లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష విలువ చేసే లావాదేవీ చోటు చేసుకున్న పాన్‌ కార్డ్‌ను తప్పనిసరి చేసింది. ఒక్క నెలలో రూ.10వేల లావాదేవీలు జరిగినా పాన్‌ ఇవ్వాల్సిందే. నిబంధనలకు అనుగుణంగా పాన్‌, ఆధార్‌ను సమర్పించనట్లయితే ఆ ఖాతాలను స్తంభింపజేస్తారు.