May 04,2023 21:16

న్యూఢిల్లీ: ఐటి కంపెనీలు భారీ లాభాలను సాధిస్తున్నప్పటికీ మార్జిన్లను మరింత పెంచుకోవడానికి ఉద్యోగులకు ఉద్వాసనలు పలుకుతున్నాయి. తాజాగా దిగ్గజ ఐటి కంపెనీ కాగ్నిజెంట్‌ 3500 మంది ఉద్యోగులపై వేటు వేయడానికి సిద్దం అయ్యింది. ఇది అమెరికన్‌ కంపెనీ అయినప్పటికీ భారత్‌లోనే ఎక్కువ కార్యకలాపాలను కలిగి ఉండటం విశేషం. వ్యయాలను తగ్గించుకోవడానికి వీలుగా సిబ్బందికి పింక్‌ స్లిప్స్‌ను జారీ చేయనున్నటుగా ఆ సంస్థ సిఇఒ ఎస్‌ రవి కుమార్‌ తెలిపారు. అదే విధంగా 1.1 కోట్ల చదరపు అడుగుల కార్యాలయ స్థలాలను కూడా వదులుకోనున్నామన్నారు. 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ లాభాలు 11 శాతం పెరిగాయి. ప్రస్తుతం కాగ్నిజెంట్‌లో 3.50 లక్షల పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో రెండు లక్షల మంది భారత్‌లోనే ఉన్నారు.