Aug 15,2023 21:35

బెంగళూరు : విద్యుత్‌ ద్విచక్ర వాహనాల తయారీదారు ఓలా ఎలక్ట్రిక్‌ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా మూడు కొత్త వాహనాలను విడుదల చేసింది. ఓలా ఎలక్ట్రిక్‌ ఎస్‌1 ఎక్స్‌ను మూడు వేరింట్లలలో అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. బడ్జెట్‌ ధరలో ఓలా ఎస్‌ 1 ఎక్స్‌తో పాటు ఓలా ఎస్‌1 ప్రో జనరేషన్‌ 2లను ఆవిష్కరించింది. ఎక్స్‌షోరూం వద్ద ఓలా ఎస్‌1 ఎక్స్‌ ధర రూ.79,000గా, ఓలా ఎస్‌1 ప్రో జనరేషన్‌ 2 ధరను రూ.1.47 లక్షలుగా నిర్ణయించింది. పొదుపు చర్యల్లో భాగంగా వాహన తయారీ కోసం బ్లాక్‌ ప్లాస్టిక్‌ను ఉపయోగించింది. త్వరలో విద్యుత్‌ బైకులను విడుదల చేస్తామని ఓలా వెల్లడించింది. డైమండ్‌ హెడ్‌, అడ్వెంచర్‌, రోడ్‌స్టర్‌, క్రూయిజర్‌ పేర్లతో వీటిని విడుదల చేయనుంది. మంగళవారం నాటి కార్యక్రమంలో ఈ కాన్సెప్ట్‌ బైక్‌లను ప్రదర్శించింది. వీటి పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది. 2024 చివరికల్లా వీటిని తీసుకురానుందని తెలుస్తోంది.