
ప్రజాశక్తి - పల్నాడు : పల్నాడు జిల్లాలో రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగనన్న సురక్ష పథకం ద్వారా జరిపిన సర్వే కార్యక్రమం ద్వారా 97 శాతం పూర్తి చేసినట్లు కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. నరసరావుపేట కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ప్రతీ గ్రామంలో ఉన్న 538 సచివాలయాల ద్వారా 10,770 మంది వాలంటీర్లు జూన్ 24 నుంచి జూలై 31 వరకు సర్వే కార్యక్రమం పూర్తి చేయించామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జగనన్న సురక్ష పథకం ద్వారా 1,54,033 దరఖాస్తులు వచ్చాయని, అందులో 1,43,755 దరఖాస్తులు పరిశీలన చేసి,1,39,498 ధృవీకరణ పత్రాలను మంజూరు చేశామన్నారు. మిగిలిన 4,970 దరఖాస్తులు ఆధార్ కార్డుల పేర్లు తప్పులు, ఫోన్ నంబర్ల తప్పులు, పుట్టిన తేది, మరణ తేది దృవీకరణ పత్రాలు తదితర అంశాలకు సంబంధించినవి పెండింగ్లో ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ ధృవీకరణ పత్రాలు, విద్యా సంక్షేమ పథకాలకు సంబంధించిన పత్రాలుకు సంబంధించిన వివరాల నమోదుకు నిర్ణీత గడువు ఉండటంతో 7 శాతం పెండింగ్ ఉన్నాయని కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వం నిర్దిష్ట కాల పరిమితిలోపు ప్రజలకు సకాలంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం కోసం జగనన్న సురక్ష పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రజల ధృవీకరణ పత్రాలను సకాలంలో అందించడం ద్వారా మేలు చేసే కార్యక్రమం చేపట్టి విజయవంతం చేసిన వాలంటీర్లను, ఉద్యోగులను కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అభివృద్ధి అధికారిణి మహాలక్ష్మీ, కలెక్టరేట్ ఏ.ఓ అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.