Sep 01,2023 22:08

జ్యూరిచ్‌: జూరిచ్‌లో జరుగుతున్న డైమండ్‌ లీగ్‌ పోటీల్లో భారత జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా సత్తా చాటాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈవెంట్‌లో నీరజ్‌ 85.71మీ. విసిరి రెండోస్థానంలో నిలిచాడు. లెడ్జిగ్రౌండ్‌ స్టేడియంలో జరిగిన ఈ పోటీలను వీక్షించేందుకు సుమారు 25వేల మంది ప్రేక్షకులు హాజరుకాగా.. ప్రధాన ఆకర్షణగా టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ కుటుంబ సభ్యులతో హాజరుకావడమే. నీరజ్‌ ప్రాతినిధ్యం వహించిన జావెలిన్‌ త్రో పోటీలను ఫెదరర్‌, భార్య మిర్కా, కుమార్తెలు ఛార్లెనె రివా, మైలా రోజ్‌లతో కలిసి వీక్షించాడు. అలాగే ఫెదరర్‌ తల్లిదండ్రులు రాబర్ట్‌, లైనెట్టె కూడా వీక్షించారు. ఫెదరర్‌ కుటుంబ సభ్యులతో కలిసి జావెలిన్‌ త్రో పోటీలను చూస్తున్న ఫొటోలను అభిమానులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ పోటీల్లో జాకోబ్‌ వెడ్ల్రెజ్‌ 85.86మీ. అగ్రస్థానంలో నిలువగా.. జర్మనీకి చెందిన జూలియన్‌ వెబెర్‌ 85.04మీ. మూడో స్థానంలో నిలిచాడు.