Oct 10,2022 11:07

పెరట్లో జామ చెట్టు కింద కూర్చుని రాము ఏడుస్తున్నాడు. చెట్టు పైన ఉన్న రామచిలుక, రాము ఏడవడం చూసి 'రామూ, ఎందుకు ఏడుస్తున్నావు?' అని అడిగింది.
రాము ఏడుస్తూనే.. 'అమ్మ! ఊరికి వెళ్లింది. నేనూ వస్తానంటే నన్ను బడికి వెళ్లమని పంపింది.' అంటూ ఎక్కి ఎక్కి ఏడవసాగాడు. అప్పుడు రామచిలుక, 'అమ్మా! సరిగానే చెప్పింది కదా! నువ్వు బడికి వెళ్లకుండా, అమ్మతో ఊరు వెళితే ఈ రోజు పాఠాలన్నీ వినలేవు కదా. అప్పుడు చదువులో వెనకబడి పోతావు. నీ మంచి కోసమే అమ్మ చెప్పింది. అమ్మ మాట వింటే మనకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. నేను కూడా ఒకసారి మా అమ్మ చెప్పిన మాట వినకుండా తన వెంట వెళ్లాను. అప్పుడు కొంతమంది వేటగాళ్లు నా వెంటబడ్డారు. నేను పైకి ఎగరలేకపోయాను. అప్పుడు అమ్మ చాలా ఇబ్బందులు పడి నన్ను కాపాడింది. అందుకే అప్పటి నుంచి నేను ఈ గూటిలోనే ఉంటున్నా. కొంచెం పెద్దయ్యాక అమ్మతో ఆహారం కోసం వెళతా. అందుకే అమ్మ మాట బంగారు బాట. నీవు అమ్మ మాట విని బడికి వెళ్లు. చక్కగా పాఠాలు నేర్చుకో, స్నేహితులతో కలిసి ఆడుకో. సాయంకాలం అమ్మ వచ్చేటప్పుడు నీకు అన్నీ తెస్తుంది. నిన్ను మెచ్చుకుంటుంది.' అంటూ రాముకి హితవు చెప్పింది. రామచిలుక మాటలు రాముకి జ్ఞానోదయమైంది. రామచిలకకు కృతజ్ఞతలు చెబుతూ ఆనందంగా బడికి పరుగు తీశాడు.

- మొర్రి గోపి
88978 82202