- భారత్లో పెట్టుబడులు పెట్టండి
- అమెరికాలో పెట్టుబడిదారులతో మంత్రి
న్యూఢిల్లీ : బ్రిటన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం (ఎఫ్టిఎ) కోసం ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సీతారామన్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. వాషింగ్టన్లోని పీటర్సన్ ఇన్స్ట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ (పిఐఐఇ)లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. చాలా వేగంగా ఎఫ్టిఎ అంగీకారానికి రావాలని భావిస్తున్నామన్నారు. అదే విధంగా యూరోపియన్ యూనియన్, కెనడాతోనూ స్వేచ్ఛా వాణిజ్యానికి ఆసక్తిగా ఉన్నామన్నారు. బ్రిటన్తో ఎఫ్టిఎ చర్చలు ముగిశాయని.. విఫలం అయ్యాయని ఇటీవల వచ్చిన పలు రిపోర్టుల్లో నిజం లేదన్నారు.
ఈ పర్యటనలో యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలోనూ మంత్రి మాట్లాడారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని అమెరికా వ్యాపారవేత్తలను ఆమె కోరారు. ప్రపంచ స్థాయి కంపెనీలు భారత దేశ అభివృద్థిలో భాగమయ్యేందుకు అవకాశాలు కల్పిస్తోన్నామన్నారు. కోవిడ్ కాలంలోనూ పెట్టుబడిదారుల కోసం విధానపరమైన సంస్కరణలు కొనసాగించామన్నారు. డిజిటల్ చెల్లింపుల వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారిందన్నారు.
ఈ సమయంలో భారత్లో లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి పెట్టుబడిదారులకు సూచించారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 190 బిలియన్ డాలర్లను దాటేసిందని అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధు పేర్కొన్నారు.. ఇరు దేశాల సంబంధాలు ఇలానే పెరగడానికి అమెరికాలోని వాణిజ్య వర్గాల నుంచి భారత ఆర్థిక శాఖ అభిప్రాయాలను స్వీకరిస్తుందన్నారు.










