- ప్రధాన ఇన్వెస్టర్ ఐఐఎఫ్ఎం లైసెన్స్ రద్దు
- పలు విత్త చట్టాల ఉల్లంఘనలు
- ఫైనాన్సీయల్ సర్వీసెస్ కమిషన్ చర్యలు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న గౌతం అదానీ కంపెనీల్లో డొల్ల పెట్టుబడులు పెడుతోన్న కంపెనీల చిట్టాలు బయటపడుతున్నాయి. తాజాగా మారిషస్ కేంద్రంగా పని చేస్తోన్న ఓ సంస్థ అదానీ కంపెనీల్లో అక్రమ పెట్టుబడులు పెడుతూ.. మనీలాండరింగ్కు పాల్పడుతోన్న వైనం బట్టబయలయ్యాయి. ఎమర్జింగ్ ఇండియా ఫండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఇఐఎఫ్ఎం) దొడ్డిదారి పెట్టుబడుల వ్యహారాన్ని గర్తించిన మారిషస్ ఫైనాన్సీయల్ రెగ్యులేటర్ అయినా ఫైనాన్సీయల్ సర్వీసెస్ కమిషన్ (ఎఫ్ఎస్సి) ఆ సంస్థపై కఠిన నిర్ణయం తీసుకుందని ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. అదానీ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలలో నిబంధనలకు విరుద్దంగా పెట్టుబడులు పెట్టిన ఇఐఎఫ్ఎం వ్యాపార, పెట్టుబడుల లైసెన్స్లను 2022 మేలో రద్దు చేసింది. దీనిపై ఇంకా విచారణ జరుగుతుంది. హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత ఇఐఎఫ్ఎం, ఇఎం రెసుర్జెంట్ ఫండ్ సహా 13 విదేశీ అదానీ ఇన్వెస్టర్లపై మనీలాండరింగ్ యాక్ట్ కింద సెబీ విచారిస్తోంది. అదానీ గ్రూపు కంపెనీల అకౌంట్స్ మోసాలు, కృత్రిమంగా షేర్ల ధరల పెంపునకు పాల్పడుతున్నాయని హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక విడుదల చేయడానికి ఎనిమిది నెలల ముందు ఐఐఎఫ్ఎం లైసెన్స్ రద్దు అయ్యింది.
ఇఐఎఫ్ఎం మనీలాండరింగ్కు పాల్పడటం, కార్పొరేట్ గవర్నెన్స్ చట్టాలను సహా అనేక నిబంధనలను ఉల్లఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్ఎస్సి నివేదిక పేర్కొంది. ''ఫైనాన్సీయల్ సర్వీసెస్ చట్టం, సెక్యూరిటీస్ యాక్ట్, ఫైనాన్సీయల్ ఇంటెలిజెన్స్ అండ్ యాంటీ మనీలాండరింగ్ రెగ్యూలేషన్స్(2003, 2018), మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సీంగ్ నిరోధానికి సంబంధించిన కోడ్లోని వివిధ సెక్షన్లను ఇఐఎఫ్ఎం ఉల్లఘించింది. క్లయింట్లు, లావాదేవీల రికార్డులను నిర్వహించడం, అకౌంటింగ్, ఆడిటింగ్ ప్రమాణాలను పాటించకపోవడానికి సంబంధించిన అనేక అవకతవకలను గుర్తించాం. మారిషస్ ఫైనాన్సీయల్ ఇంటెలిజెన్స్, యాంటీ మనీ లాండరింగ్ రెగ్యులేషన్స్ 2003, 2018లను ఉల్లంఘించినందుకు ఐఐఎఫ్ఎం దోషిగా నిర్ధారించబడింది.'' అని మారిషస్ ఫైనాన్సీయల్ రెగ్యులేటర్ ఫైనాన్సీయల్ సర్వీసెస్ కమిషన్ తన రిపోర్ట్లో స్పష్టం చేసింది. ఎఫ్ఎస్సి రిపోర్ట్ ప్రకారం.. 2018 ఏప్రిల్ నాటికి ఇఐఎఫ్ఎంకు చెందిన రెండు మారిషస్ ఫండ్లు అదానీ పవర్ లిమిటెడ్లో 3.9 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్లో 3.86 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్లో 1.73 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నాయి. ఇఐఎఫ్ఎం లైసెన్స్ల రద్దుపై అదానీ గ్రూపు ప్రతినిధి స్పందిస్తూ.. స్వతంత్ర వ్యక్తిగత వాటాదారులకు సంబంధించిన విషయాలపై తాము వ్యాఖ్యానించలేమని పేర్కొన్నారు.
అదానీ లిస్టెడ్ కంపెనీల్లో షేర్లను కొనుగోలు చేస్తూ.. కృత్రిమ ధరల పెంపునకు పాల్పడుతోన్న ఎనిమిది విదేశీ ఫండ్లలో ఆరు సంస్థలు మాయమయ్యాయని ఇటీవల మింట్ ఓ కథనంలో వెల్లడించింది. 2020లో అదానీ గ్రూప్ కంపెనీలలో విదేశీ సంస్థల హోల్డింగ్లపై మార్కెట్స్ రెగ్యులేటర్ దర్యాప్తు ప్రారంభించిన తర్వాత అవి మూతపడటంతో అదానీ కంపెనీల్లో అజ్ఞాత పెట్టుబడులకు మరింత బలం చేకూరినట్లయ్యింది. అదానీ గ్రూప్లో రహస్యంగా పెట్టుబడి పెట్టిన ఇద్దరు వ్యక్తులు.. అదానీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని ఆర్డనైజ్డ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఒసిసిఆర్పి) మరో రిపోర్ట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. గౌతం అదానీ సోదరుడు వినోద్ అదానీ సంస్థల్లో పెట్టుబడులు కలిగి ఉన్నారని పేర్కొంది. ఈ వరుస పరిణామాలు, రిపోర్ట్లు అదానీ గ్రూపుల్లో జరుగుతోన్న ఆర్థిక అక్రమాలు, కుంభకోణాలకు దర్పణం పడుతోన్నాయని స్పష్టం అవుతోంది.