Jul 14,2023 11:06
  • ఏడాదికి మూడువేలు ఉత్పత్తి
  • ఒక్క డ్రోన్‌తోనే రోజుకు 30 ఎకరాల్లో పురుగుమందు పిచికారీ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : దేశంలో ప్రముఖ డ్రోన్‌ తయారీ సంస్థ డ్రోన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఎపిలోని తాడేపల్లి కేంద్రంగా డ్రోన్ల తయారీకి సిద్ధమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో తయారు చేస్తున్నా త్వరలో తాడేపల్లి నుంచి తయారీ ప్రారంభించనున్నట్లు సంస్థ సిఇఒ బొంతు యశ్వంత్‌ ప్రకటించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం మానవ రహిత వైమానిక వాహనం (యుఎవి) క్రిషి 2.0ను ఆవిష్కరించామని, ఈ డ్రోన్‌ ద్వారా రోజుకు 30 ఎకరాల్లో క్రిమి సంహారక పురుగుమందులు పిచికారీ చేయొచ్చని తెలిపారు. ఇప్పటికే సర్వేయింగ్‌, మ్యాపింగ్‌, ధర్మల్‌ ఇమేజింగ్‌, లీడార్‌ సేవలను సేవలందిస్తున్న డ్రోగో డ్రోన్స్‌ కొత్తగా తయారీ రంగంలోకి దిగిందని, డిమాండ్‌ను బట్టి ఉత్పత్తిని పెంచుతామని ఆయన వివరించారు. డ్రోన్‌ సేవల రంగం వచ్చే మూడేళ్లలో రూ.30 వేల కోట్లకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 26 సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని యశ్వంత్‌ వివరించారు.