Aug 04,2023 14:28

న్యూఢిల్లీ : మణిపూర్‌లోని బిష్ణుపూర్‌ జిల్లా... మొయిరాంగ్‌ పోలీస్‌స్టేషన్‌పై ఓ గుంపు గురువారం దాడి చేసి, పోలీస్‌ స్టేషన్‌లోని ఆయుధాలను లూటీ చేసింది. ఈ ఘటనతో ఆ రాష్ట్రంలో హింస మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మొయిరాంగ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. 'పోలీస్‌ స్టేషన్‌ వద్దకు గురువారం ఉదయం సుమారు 9.45 గంటల సమయంలో ఓ పెద్ద గుంపు వచ్చింది. దాదాపు 40-45 వాహనాల్లో వచ్చిన సుమారు 500 మందితో ఉన్న ఆ గుంపు మొయిరాంగ్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రధాన గేటును పగలగొట్టి.. స్టేషన్‌పై దాడి చేసి.. అందులో ఉన్న ఆయుధాలను లూటీ చేసింది. ఈ గుంపు ఎఫ్‌ రైఫిల్‌, ఐఎన్‌ఎస్‌ఎఎస్‌ రైఫిల్స్‌, ఎల్‌ఎంజిలు, పిస్టల్స్‌, కార్బైన్లు, డిటోనేటర్లు, స్పేర్‌ బారెల్స్‌, పిస్టల్స్‌, జిఎఫ్‌ రైఫిల్స్‌, మోర్టార్స్‌, టియర్‌గ్యాస్‌ గన్‌లు, ఎఎంఓజిహెచ్‌ కార్బైన్‌లు, ఎస్‌ఎల్‌ఆర్‌ గన్‌లు, వివిధ రకాల గన్‌లు, మ్యాగజైన్‌లు వంటి ఆధునిక ఆయుధాలతోపాటు, ఇతర ఆయుధాలు, మందుగుండుసామాగ్రిని లూటీ చేసింది' అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే ఈ గుంపును నిలువరించేందుకు 327 రౌండ్ల మందుగుండు సామాగ్రి, 20 టియర్‌ స్మోక్‌ షెల్స్‌ కాల్చినప్పటికీ ఫలితం లేకపోయిందని ఎఫ్‌ఐఆర్‌ వెల్లడించింది.
కాగా, మణిపూర్‌లో మే 3వ తేదీన ప్రారంభమైన ఈ ఘర్షణల వల్ల వందలాది మంది మృతి చెందారు. ఇక అక్కడ భారీస్థాయిలో ఆయుధాల దోపిడీ జరుగుతోంది. ఇప్పటివరకు నాలుగు వేల ఆయుధాలు, లక్షల సంఖ్యలో మందుగుండు సామాగ్రి చోరీ జరిగితే.. పోలీసులు కేవలం 16 వందల ఆయుధాలను మాత్రమే తిరిగి పొందారని 'ద హిందూ' నివేదించింది. గత నెలలో కేంద్ర హోంశాఖామంత్రి అమిత్‌షా మణిపూర్‌లో పర్యటించి.. అక్కడ ఘర్షణల్ని నిలువరించాలంటే.. ఆయుధాలను తిరిగి ఇవ్వాలని ప్రజలను ఆయన అభ్యర్థించారు. అయితే తాజా ఘటనతో సాధారణ పరిస్థితులు నెలకొనే పరిస్థితులు లేవని తెలుస్తోంది. ఇంఫాల్‌ వెస్ట్‌లో జరిగిన హింసలో ఒక పోలీసు అధికారి మృతి చెందినట్లు ప్రముఖ మీడియా ఛానెల్‌ ఎన్‌డిటివి తెలిపింది.