ప్రజాశక్తి-హైదరాబాద్బ్యూరో : దేశంలో ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థల్ని ప్రయివేటుపరం చేసేందుకు కేంద్రం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాల్ని వినియోగించుకోవాలని చూస్తోంది. విద్యుత్ చట్ట సవరణ-2022 బిల్లు పార్లమెంటు స్టాండింగ్ కమిటీ పరిశీలనలో ఉన్నప్పటికీ, దొడ్డితోవన ఆ బిల్లులోని అంశాలను అమలు చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. చండీగఢ్, పుదుచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ సంస్థల్ని (డిస్కంలు) ప్రయివేటుకు అప్పగించేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ప్రజలు, విద్యుత్ ఉద్యోగులు ఈ ప్రయత్నాలను సమైక్యంగా అడ్డుకోవడంతో తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. ఇప్పుడు ట్రాన్స్కో ఆస్తుల్ని ప్రయివేటుకు అప్పగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ కార్యదర్శి సంజీవ్ జైన్ ఈనెల 3న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, ఇంథనశాఖ కార్యదర్శులకు లేఖలు రాశారు. ట్రాన్స్కో నిర్వహణలో ఉన్న విద్యుత్ లైన్లను వివిధ రాష్ట్రాల్లోని ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలకు లీజులకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రాన్స్కో నిర్మిస్తున్న విద్యుత్ లైన్లను ఇకపై ఓపెన్ బిడ్డింగ్ ద్వారా ప్రయివేటు, కార్పొరేట్, ట్రస్టుల ద్వారా నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఈ కొత్త కరెంటు లైన్ల నిర్మాణాలను ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పిపిపి), టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టిఒటి), ఆపరేషన్, మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ (ఒఎమ్డిఎ) తదితర పద్ధతుల్లో వారికి అప్పగించాలని తెలిపారు. ఈ మేరకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గతంలో రూ.7,700 కోట్లతో ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఐఎన్విఐటి) ఐదు రకాల పద్ధతులను గుర్తించిందని పేర్కొన్నారు.










