Nov 06,2023 13:07

మైలవరం (ఎన్‌టిఆర్‌) : న్యూస్‌ క్లిక్‌ మీడియా సంస్థ అధిపతి ప్రబీర్‌ పురకాయస్త పై కేంద్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలను సోమవారం మండలంలోని చండగూడెం పూల మార్కెట్‌ వద్ద ప్రజా సంఘాల నేతలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి పివి.ఆంజనేయులు మాట్లాడుతూ ... ఫోర్త్‌ ఎస్టేట్‌ గా పిలవబడే మీడియాపై కేంద్రంలోని బిజెపి ఆంక్షలు విధించడం మీడియా నోరు నొక్కేయడమేనన్నారు. నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలియజేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వ్యవహరిస్తున్న మీడియాను అణగదొక్కాలని చూస్తే తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌ సుధాకర్‌, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు రావుల సుబ్బారావు, వజ్రాల వెంకటరెడ్డి, రైతు సంఘం రెడ్డిగూడెం మండల నాయకులు ఉయ్యూరు కృష్ణారెడ్డి, రైతు సంఘం సీనియర్‌ నాయకులు మద్దిరెడ్డి మాధవరెడ్డి, కౌలు రైతు సంఘం నాయకులు సందీపాము, ఇస్సాకు, తదితరులు పాల్గొన్నారు.