బెంగళూరు : తన యోయో టెస్ట్ స్కోరును విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో షేర్ చేయడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీమ్ రహస్య సమాచారాన్ని పబ్లిక్ ప్లాట్ ఫామ్లో బహిర్గతం చేయడం బీసీసీఐ రూల్స్ ను ఉల్లంఘించడం కిందకు వస్తుందని హెచ్చరించింది. మరోసారి ఇలాంటివి పునరావతమైతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. జట్టులో ఉన్న సభ్యులెవరూ టీమ్ సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఆదేశించింది. యోయో టెస్టులో తనకు 17.2 స్కోరు వచ్చినట్టు కోహ్లీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. బీసీసీఐ నిర్దేశించిన స్కోరు 16.5ని అధిగమించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశాడు. దీంతో బీసీసీఐ అసహనం వ్యక్తం చేసింది. జట్టు అంతర్గత వివరాలను బహిరంగ పరచొద్దని ఆటగాళ్లను హెచ్చరించింది.










