Sep 08,2023 22:05

వన్డే ప్రపంచకప్‌కు అధికారుల పేర్లను ప్రకటించిన ఐసిసి
దుబాయ్: భారత్‌ వేదికగా అక్టోబర్‌లో జరిగే 13వ వన్డే ప్రపంచకప్‌ అధికారుల పేర్లను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) శుక్రవారం వెల్లడించింది. భారత్‌నుంచి ఐసిసి రిఫరీగా జవగళ్‌ శ్రీనాథ్‌, ఫీల్డ్‌ అంపైర్‌గా నితిన్‌ మీనన్‌లకు చోటు దక్కింది. వన్డే ప్రపంచకప్‌లో బాధ్యతలు నిర్వర్తించే అధికారులు, ఫీల్డ్‌, నాల్గో, టీవీ అంపైర్‌లతోపాటు మ్యాచ్‌ రిఫరీల పేర్లను ఐసిసి శుక్రవారం ప్రకటించింది. తొలి రౌండ్‌లో జరిగే పోటీలకు 20మంది మ్యాచ్‌ అధికారులు ఉండనున్నట్లు, అలాగే ఐసిసి అంపైర్ల ఎమిరేట్స్‌ ప్యానల్‌లోని 12మంది, ఐసిసి ఎమర్జింగ్‌ అంపైర్‌ ప్యానెల్‌లోని నలుగురు సభ్యులతో సహా మొత్తం 16మంది మ్యాచ్‌ అంపైర్ల పేర్లనూ వెల్లడించింది. ఇక ఎమిరేట్స్‌ ఐసిసి ఎలైట్‌ ప్యానెల్‌ ఆఫ్‌ మ్యాచ్‌ రిఫరీలుగా జెఫ్‌ క్రో, ఆండీ ఫైక్రాఫ్ట్‌, రిచీ రిచర్డ్‌సన్‌, జవగళ్‌ శ్రీనాథ్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌కు శ్రీనాథ్‌ మ్యాచ్‌ రిఫరీగా.. నితిన్‌ మీనన్‌, కుమార ధర్మసేన స్టాండింగ్‌ అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు.. పాల్‌ విల్సన్‌ టీవీ అంపైర్‌గా, సైకత్‌ ఫోర్త్‌(నాల్గో) అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు వెల్లడించింది.
వన్డే ప్రపంచకప్‌ ఐసిసి అధికారులు: క్రిస్‌ బ్రౌన్‌, కుమార ధర్మసేన, మారిస్‌ ఎరస్మస్‌, క్రిస్‌ గఫనీ, మిఛెల్‌ గాఫ్‌, ఆడ్రియన్‌ హోల్డ్‌స్టోక్‌, రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌, రిచర్డ్‌ క్యాటెల్‌బరో, నితిన్‌ మీనన్‌, అహసన్‌ రాజా, పాల్‌ రీఫిల్‌, షర్ఫుదౌల్లా షాహిద్‌, రాడ్‌ టక్కర్‌, అలెక్స్‌ వార్ఫ్‌, జో విల్సన్‌, పాల్‌ విల్సన్‌.
రిఫరీలు: జెఫ్‌ క్రో, ఆండీ పేక్రాఫ్ట్‌, రిచీ రిచర్డుసన్‌, జవగళ్‌ శ్రీనాథ్‌.