Oct 21,2023 08:04

అమర్‌నాథ్‌ రెండు ఓట్ల తేడాతో గెలుపు
హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సిఎ) నూతన అధ్యక్షుడిగా జగన్మోహనరావు ఎన్నికయ్యారు. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం(ఉప్పల్‌)లో జరిగిన ఎన్నికల్లో హెచ్‌సీఏకు కొత్త అధ్యక్షుడిగా అర్శనపల్లి జగన్‌ మోహన్‌ రావు ఎన్నికయ్యారు. యునైటెడ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ హెచ్‌సిఎ ప్యానెల్‌ నుంచి పోటీ చేసిన జగన్‌ మోహన్‌ రావు కేవలం ఒక్క ఓటు తేడాతో అనిల్‌ కుమార్‌పై విజయం సాధించారు. మొత్తం 173మంది ఓటర్లు ఉండగా.. 169ఓట్లు పోలయ్యాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్‌ పదవులకు ఎన్నికలు జరిగాయి. జగన్‌మోహన్‌ రావుకు అనుకూలంగా 63 ఓట్లు రాగా.. అమర్‌నాథ్‌కు 62 ఓట్లు వచ్చాయి. గుడ్‌ గవర్నెన్స్‌ నుంచి బరిలో ఉన్న కె.అనిల్‌ కుమార్‌కు 10, ఆనెస్ట్‌ హార్డ్‌ వర్కింగ్‌ హెచ్‌సీఏ ప్యానెల్‌ తరఫున పోటీపడిన పీఎల్‌ శ్రీనివాస్‌కు 34 ఓట్లు వచ్చాయి. మాజీ క్రికెటర్లు వివిఎస్‌ లక్ష్మణ్‌, వెంకటపతిరాజు, మిథాలీ రాజ్‌, ప్రజ్ఞాన్‌ ఓఝా, టిఎస్‌ఆర్టీసి ఎండి విసి సజ్జనార్‌, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ రొనాల్డ్‌ రాస్‌, తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఉన్నారు. రిటర్నింగ్‌ అధికారిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి విఎస్‌ సంపత్‌ వ్యవహరించారు. ఉదయం 10గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై.. మధ్యాహ్నం 3గంటలకు ముగిసింది. సాయంత్రం 4గంటలకు ఓట్ల లెక్కింపు చేశారు.

  • నూతన కార్యవర్గం...

జగన్మోహన్‌ రావు : అధ్యక్షుడు(యునైటెడ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ హెచ్‌ సిఎ ప్యానెల్‌)
దల్జీత్‌ సింగ్‌ : ఉపాధ్యక్షుడు(గుడ్‌ గవర్నెన్స్‌ ప్యానెల్‌)
దేవరాజు : కార్యదర్శి(క్రికెట్‌ ఫస్ట్‌ ప్యానెల్‌)
బసవరాజు : సంయుక్త కార్యదర్శి(గుడ్‌ గవర్నెన్స్‌ ప్యానెల్‌)
సీజే శ్రీనివాసరావు : ట్రెజరర్‌(యునైటెడ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ హెచ్‌ సిఎ ప్యానెల్‌)
కౌన్సిలర్‌ : సునీల్‌ అగర్వాల్‌(క్రికెట్‌ ఫస్ట్‌ ప్యానెల్‌)