- ఎఫ్టిసిసిఐ నిర్వహణ
హైదరాబాద్ : వచ్చే జూన్లో ఇండిస్టియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నలాజీ పారిశ్రామిక ప్రదర్శన -2023ను నిర్వహించనున్నామని ఎఫ్టిసిసిఐ వెల్లడించింది. సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్టిసిసిఐ) అధ్యక్షుడు అనిల్ అగర్వాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్తో కలిసి ఎక్స్పో లోగో, బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణల వినియోగం ద్వారా ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని ప్రాంతీయ ఛాంబర్లు, రాష్ట్రాలు పాల్గొనేలా, వారి స్వంత పెవిలియన్లను కలిగి ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జూన్ 28 నుండి 30 వరకు మూడు రోజుల పాటు హైటెక్స్లో ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నామన్నారు. 150 స్టాల్స్ను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా ప్యాకేజింగ్, ప్రింటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, విద్యుత్ వాహనాలు, పునరుత్పాదన ఇంధన రంగాల్లోని వారు పాల్గొననున్నారన్నారు.










