Sep 29,2023 21:46
  • 10మీ ఎయిర్‌ పిస్టల్‌, 50మీ. ఎయిర్‌ రైఫిల్‌లో స్వర్ణాలు
  • ఒక్కో రజత, కాంస్యాలు కూడా..
  • టెన్నిస్‌ పురుషుల డబుల్స్‌లో రజతం

హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత షూటర్లు దుమ్మురేపుతున్నారు. శుక్రవారం జరిగిన మహిళల వ్యక్తిగత 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌, పురుషుల 50మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగాల్లో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు దక్కాయి. వ్యక్తిగత 10మీ. ఎయిర్‌ పిస్టల్‌లో పాలక్‌ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నది. 17ఏళ్ల ఆ షూటర్‌ .. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ బంగారు పతకాన్ని ఎగరేసుకుపోయింది. వ్యక్తిగత ఈవెంట్‌లో పాలక్‌ ముందు నుంచే దూసుకెళ్లింది. 13 షాట్స్‌ తర్వాత ఆమె 131.4 స్కోర్‌తో లీడింగ్‌లో ఉంది. 23 షాట్స్‌ తర్వాత పాలక్‌.. 232.6 స్కోరుతో, ఇషా సింగ్‌ 229.2 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం కైవసం చేసుకుంది.

esa

50మీ. ఎయిర్‌ రైఫిల్‌-3లో ప్రపంచ రికార్డు..

పురుషుల 50మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌-3 విభాగంలో భారత షూటర్లు ప్రపంచ రికార్డు నమోదు చేశారు. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఐశ్వరీ ప్రతాప్‌సింగ్‌ థోమర్‌, స్వప్నిల్‌ కుశాలే, అఖిల్‌ షోరెన్‌లతో కూడిన భారతజట్టు అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. అలాగే 1796 పాయింట్లతో ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది. ఇప్పటి ఈ రికార్డు అమెరికా పేరిట ఉంది. 2022లో జరిగిన క్యాట్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో అమెరికా 1761 పాయింట్లు ఈ రికార్డును నెలకొల్పింది. ఇక 1763 పాయింట్లతో దక్షిణ కొరియా రెండు జట్లు రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నాయి.
అలాగే 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగంలో భారత జట్టు కాంస్య పతకం గెలుపొందింది. ఈశా సింగ్‌, పాలక్‌, దివ్యా సుబ్బారాజ్‌తో కూడిన జట్టు మొత్తం 1731 పాయింట్లు నమోదుచేసింది. ఇదే విభాగంలో 1736 పాయింట్లతో చైనా బంగారు పతకం, 1723పాయింట్లతో చైనీ తైపీ రజతం కైవసం చేసుకున్నాయి.
టెన్నిస్‌లో ఇప్పటి వరకు నిరాశాజనక ఫలితాలు నమోదు కాగా.. ఇప్పుడు వాటికి చెక్‌ పెడుతూ డబుల్స్‌లో రజత పతకం భారత్‌ సాధించింది. డబుల్స్‌ విభాగంలో సాకేత్‌ మైనేని, రామ్‌కుమార్‌ రామనాథన్‌ జోడీ సిల్వర్‌ గెలుచుకుంది. రామ్‌కుమార్‌కు ఆసియా క్రీడల్లో తొలి మెడల్‌ కాగా.. సాకేత్‌కి ఇది మూడోది కావడం విశేషం. ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో భారత పతకాల సంఖ్య 30కి చేరింది. దీంతో పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి చేరుకుంది.

2


మహిళల హాకీ జట్టు గ్రూప్‌-ఏ లీగ్‌ దశలో మరో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు 6-0తో మలేషియాను చిత్తుచేసింది. తొలి క్వార్టర్‌ ముగిసే సరికే భారత్‌ 4-0గోల్స్‌తో ఆధిక్యతలో నిలిచింది. 1న కొరియాతో, 3న హాంకాంగ్‌తో తలపడనుంది. స్క్వాష్‌ పురుషుల విభాగంలో భారతజట్టు సెమీస్‌కు చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనలోల భారత్‌ 2-0తో మలేషియాను చిత్తుచేసింది. టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల విభాగం సింగిల్స్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. ప్రి క్వార్టర్స్‌లో శరత్‌ కమల్‌, జి. సాథియాన్‌ ఓటమిపాలయ్యారు. సాథియాన్‌ 3-11, 3-11, 6-11, 3-11తో 2వ ర్యాంకర్‌ వాంగ్‌(చైనా) చేతిలో ఓడాడు.

నిరాశపరిచిన మహిళా షట్లర్లు...

భారత మహిళల బ్యాడ్మింట్‌ జట్టు నిరాశపరిచింది. పీవీ సింధు నేతత్వంలో ఆ బందం పేలవ ప్రదర్శన కనబరిచింది. క్వార్టర్‌ ఫైనల్లో థాయిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు దారుణంగా ఓడిపోయింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 0-3 తేడాతో థాయిలాండ్‌ చేతిలో ఓటమి పాలైంది. బలమైన థారు జట్టు ముందు ఇండియా మహిళా షట్లర్లు నిలవలేకపోయారు.థారు జట్టులో మాజీ వరల్డ్‌ చాంపియన్‌ రచనోక్‌ ఇంటనన్‌, వరల్డ్‌ నెంబర్‌ 12 ప్లేయర్‌ పోర్న్‌పావి చోచువాంగ్‌, వరల్డ్‌ నెంబర్‌ 17 సుపనిదా కటేతాంగ్‌లు ఉన్నారు. ఆసియా క్రీడల్లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్లు కనీస పోరాటాన్ని కూడా ప్రదర్శించలేకపోయారు. రెండు సార్లు ఒలింపిక్‌ మెడల్‌ గెలిచిన పీవీ సింధు.. మహిళ సింగిల్స్‌ మ్యాచ్‌లో 21-14, 15-21, 14-21 స్కోరుతో చోచువాంగ్‌ చేతిలో ఓడిపోయింది. ట్రెస్సా జోలీ, గాయత్రి గోపిచంద్‌కు చెందిన భారత జోడి.. 19-21, 5-21 స్కోరుతో మహిళల డబుల్స్‌ ఈవెంట్‌లో పరాజయం పాలయ్యారు. ఇక ఎడమ చేతి షట్లర్‌ అస్మితా చాలిహ 9-21, 16-21 స్కోరుతో బుసానన్‌ ఒంగ్బామ్‌రుంగ్‌పాన్‌ చేతిలో ఓడిపోయింది. 2014లో ఇంచియాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత మహిళా షట్లర్లు టీమ్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే.

sotpoot


అలాగే మహిళళ షాట్‌పుట్‌లో కిరణ్‌ బలియాన్‌ కాంస్యం సాధించింది. దీంతో భారత్‌ పతకాల పట్టికలో భారత్‌ 8 స్వర్ణాలు, 12 రజిత, 13 కాంస్య పతకాలతో సహా మొత్తం 33 పతకాలతో 4వ స్థానానికి ఎగబాకింది.
ఇక పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు 3-0తో నేపాల్‌పై గెలిచి సెమీస్‌కు చేరింది. సింగిల్స్‌లో లక్ష్యసేన్‌, కిదాంబి శ్రీకాంత్‌, మిధున్‌ మంజునాథ్‌ విజయం సాధించారు. దీంతో భారత్‌ మరో రెండు సింగిల్స్‌ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే క్వార్టర్‌ఫైనల్లో విజయం సాధించింది. సెమీస్‌లో ఇండోనేషియా, కొరియా మ్యాచ్‌ విజేతతో తలపడనుంది.