- వర్షం కారణంగా ఫైనల్ రద్దు...
- మెరుగైన సీడింగ్ ఆధారంగా టీమిండియాను విజేతగా ప్రకటించిన నిర్వాహకులు
ఆసియా క్రీడల క్రికెట్ ఈవెంట్ లో భారత జట్టుకు స్వర్ణం లభించింది. ఇవాళ ఆఫ్ఘనిస్థాన్తో ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్థాన్ 18.2 ఓవర్లలో 5 వికెట్లకు 112 పరుగులు చేసింది. ఈ దశలో మొదలైన వర్షం ఎంతకీ ఆగకపోవడంతో మ్యాచ్ను రద్దు చేశారు. అయితే, టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ కంటే టీమిండియా సీడింగ్ మెరుగ్గా ఉండడంతో, టీమిండియానే విజేతగా ప్రకటించారు. ఆసియా క్రీడల క్రికెట్ ఈవెంట్లో భారత పురుషుల జట్టు పాల్గొనడం ఇదే తొలిసారి. అరంగేట్రంలోనే బంగారు పతకం దక్కింది. ఆసియా క్రీడల్లో భారత్కు ఇది 27వ స్వర్ణం.










