హైదరాబాద్: కేసినో కేసులో చికోటి ప్రవీణ్పై ఈడీ దర్యాప్తు అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇరు రాష్ట్రాల్లోని కొందరు రాజకీయ నేతలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే వార్తలు కలకలం రేపుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ హైదరాబాద్ లోని సీసీఎస్ పోలీసులకు చికోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశాడు. తన పేరుపై ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, తనకు ఇబ్బంది కలిగేలా, తన పేరును కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫేక్ అకౌంట్ వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నానని చెప్పారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో తనకు సంబంధాలు ఉన్నాయనే ప్రచారంలో నిజం లేదని ఆయన చెప్పారు. చిన్నజీయర్ స్వామితో కూడా తనకు పరిచయం లేదని అన్నారు. తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.










