Mar 29,2023 20:39

న్యూఢిల్లీ : అదాని గ్రూపులోని రెండు కంపెనీల్లో పాలనాపరమైన లోపాలు ఉన్నాయని ఫిచ్‌ రేటింగ్స్‌ పేర్కొంది. అదాని ట్రాన్స్‌మిషన్‌, అదాని పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ల్లో ఆర్థిక సౌలభ్యానికి ముప్పు పొంచి ఉందని ఒక రిపోర్టులో పేర్కొంది. ఈ కంపెనీల రేటింగ్స్‌ బిబిబి-లో ఎలాంటి మార్పు చేయలేదని పేర్కొంది. అలాగని.. ఈ రేటింగ్‌ను ఇక్కడే పరిమితం చేయబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ పోర్ట్స్‌ క్రెడిట్‌ ప్రొఫైల్‌ బలంగా ఉందని తెలిపింది. అదనపు అప్పులపై పరిమితులు, నిర్దిష్ట నిధుల ప్రవాహ వనరుల వల్లే ఇది సాధ్యమైందని పేర్కొంది. హిండెన్‌బర్గ్‌ దెబ్బకు ప్రపంచ కుబేరుల లిస్ట్‌లో ఒక దశలో రెండో స్థానంలో ఉన్న ఆయన తర్వాత 35 స్థానం దాటి వెళ్లారు. మరోవైపు ది కెన్‌ కూడా అదానిపై సంచలన నివేదిక విడుదల చేసింది. షేర్లను తనఖా పెట్టి తీసుకున్న రుణాలను అదానీ గ్రూప్‌ చెల్లించిందా..? అనేదానిపై అనుమానం వ్యక్తం చేసింది. మార్చి 31 వరకు గడువు ఉంటే అంతకుముందే 2.1 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.17వేల కోట్లు) రుణాలను తిరిగి చెల్లించినట్లు అదానీ గ్రూప్‌ ఈ నెల ప్రారంభంలో తెలిపింది. దీనిపై కెన్‌ ఆరోపణలు అదాని గ్రూపునపై మరిన్ని అనుమానాలు రేకెత్తించేలా చేస్తున్నాయి.