Feb 17,2023 14:53

అమెరికా: టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు ఆగడం లేదు. గూగుల్‌ ఇండియా కంట్రీ హెడ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ సంజరు గుప్తా ఈ మెయిల్స్‌ పంపారు. ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌లో వరుస లేఆఫ్స్‌ కొనసాగుతున్నాయి. తాజాగా మరికొందరిని వదిలించుకుంది. గూగుల్‌ ఇండియా వివిధ విభాగాల్లో మొత్తం 453 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. తొలగించిన ఉద్యోగులకు గురువారం అర్ధరాత్రి మెయిల్స్‌ వెళ్లినట్లు తెలిసింది. గూగుల్‌ మాతఅ సంస్థ అయిన ఆల్ఫాబెట్‌ ప్రపంచవ్యాప్తంగా 12,000 మందిని లేదా మొత్తం ఉద్యోగుల్లో 6 శాతం మందిని తొలగించనున్నట్లు గత నెలలో ప్రకటించింది. అయితే ప్రస్తుతం తొలగించిన 453 ఉద్యోగాలు గతంలో ప్రకటించిన 12,000 ఉద్యోగాల కోతల్లో భాగామేనా లేక కొత్త రౌండ్‌ లేఆఫ్‌లు ఉన్నాయా అన్నది ధ్రువీకరించలేదు.
ఉద్యోగులకు పంపిన మెయిల్స్‌లో సీఈఓ సుందర్‌ పిచాయ్ నుంచి కూడా కొన్ని ఇన్‌పుట్‌లు ఉన్నట్లు తెలిసింది. తొలగింపులకు దారితీసిన నిర్ణయాలకు తాను పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఆయన అంగీకరించారు. జనవరిలో పంపిన నోట్‌లో యూఎస్‌ వెలుపల తొలగించిన గూగుల్‌ ఉద్యోగులకు స్థానిక నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా రావాల్సినవన్నీ అందుతాయని ఆయన పేర్కొన్నారు.
గూగుల్‌లోనే ఇతర టెక్‌ కంపెనీల్లోనూ లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. అమెజాన్‌ తన వర్క్‌ఫోర్స్‌ నుంచి 18 వేల మందిని తొలగించాలని యోచిస్తోంది. ఇది తొలుత 10 వేల మందికే పరిమితం అనుకున్నా తర్వాత ఈ అంచనా మరింత పెరిగింది. మెటా కూడా 13 వేల మంది ఉద్యోగులను తొలగించింది.