- పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జట్టుకు స్వర్ణం
హాంగ్జౌ : చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షూటర్లు సత్తాచాటుతున్నారు. గురువారం మరో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్, చీమాలో కూడిన భారత జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. క్వాలిఫయింగ్లో సరబ్జోత్ , శివ నర్వాల్, అర్జున్ సింగ్, చీమా 1734 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచి గోల్డ్మెడల్ సొంతం చేసుకున్నారు. దీంతో భారత ఖాతాలో ఆరో గోల్డ్మెడల్ వచ్చి చేరింది. ఇక 1733 పాయింట్లతో రెండో స్ధానంలో నిలిచిన ఆతిథ్య చైనా సిల్వర్ మెడల్ గెలుచుకుంది.
రజతం గెలిచిన ఉషు క్రీడాకారిణి రోషిబినా దేవి
ఉషు మహిళల 60 కిలోల విభాగంలో రోషిబినా దేవి రజత పతకం గెలిచింది. ఫైనల్లో రోషిబినా దేవి చైనాకు చెందిన వు జియావోరు చేతిలో పోరాడి ఓడింది. ఆసియా క్రీడల్లో భారత ప్రస్తుతం 24 పతకాలతో నిలిచింది. ఇందులో 6 స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి.










