May 02,2023 20:47

ముంబయి : బడ్జెట్‌ విమానయాన సంస్థ గోఫస్ట్‌ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. వాడియా గ్రూప్‌ యాజమాన్యంలోని ఆ సంస్థ నిధుల కొరతతో రెండు రోజుల పాటు విమాన సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. మే 3, 4 తేదిల్లో విమానాలను రద్దు చేశామని గోఫస్ట్‌ సిఇఒ కౌశిక్‌ ఖోనా మంగళవారం తెలిపారు. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సిఎల్‌టి) ముందు స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. ఇది దురదృష్టకర నిర్ణయం అయినప్పటికీ కంపెనీ ప్రయోజనాల నిమిత్తం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆప్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ)కు అందజేశామన్నారు. సంస్థలో దాదాపు 5 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. గో ఫస్ట్‌ విమాన సంస్థకు 55 విమానాలు ఉన్నాయి. భారత విమానయాన మార్కెట్‌లో దాదాపు 7 శాతం వాటా కలిగి ఉంది.