ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం) : ఉరవకొండ పట్టణంలో త్రాగునీటి సమస్య పరిష్కారమే ధ్యేయంగా శాశ్వత పరిష్కారం దిశగా అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. పట్టణంలోని 10 వ వార్డు, ఇందిరానగర్ లో మేజర్ పంచాయతీ ఆధ్వర్యంలో 15వ,ఆర్థిక సంఘం నుంచి రూ.4 లక్షల నిధుల వ్యయంతో ఏర్పాటు చేసిన బొర్వెల్ సిస్టమ్ వాటర్ ట్యాంకులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కోట్ల రూపాయలతో అనేక పనులు చేపట్టామని ఆయన తెలిపారు.వీటిలో 2.80 కోట్లతో జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి ఉచిత కుళాయిలు ఇస్తున్నామన్నారు.పంచాయితీ నిధులతో ఆయా వార్డుల్లో ఇప్పటి వరకు దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేసి 80 బొర్వెల్ సిస్టం వాటర్ ట్యాంకులు ఏర్పాటు పూర్తి చేశామని చెప్పారు. ఉదిరిపికొండ నుంచి పైపులైన్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లలిత,ఎంపీపీ చంద్రమ్మ, జెడ్పిటిసి పార్వతమ్మ,వైస్ ఎంపీపీ నరసింహులు,ఉప సర్పంచ్ వన్నప్ప,పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు సీపీ. వీరన్న,పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు బసవరాజు,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










