Oct 17,2023 11:46

హైదరాబాద్‌ : హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ భాస్కరరావు సోమవారం తుది శ్వాస విడిచారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన ఆయన 86 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. జస్టిస్‌ భాస్కరరావు స్వస్థలం నల్గొండ జిల్లా చంతపల్లి మండలం ఘడియ గౌరారం. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ ఈస్ట్‌ కళ్యాణపురిలో నివాసం ఉండేవారు. 1937లో జన్మించిన జస్టిస్‌ భాస్కరరావు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1963లో న్యాయవాదిగా తన ప్రయాణం ప్రారంభించారు. 1981లో జిల్లా సెషన్స్‌ జడ్జిగా నియమితులయ్యారు. అనంతరం 1995లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 1997లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1999లో పదవీవిరమణ పొందారు. జస్టిస్‌ భాస్కరరావుకు భార్య లలితాదేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు నేడు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.